Sankranthi Gift: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి, సంక్రాంతి పండుగకు ఏదో ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతి నాడు మ్యాచ్ ఉంటే చాలు పూనకాలతో కోహ్లీ రెచ్చిపోతూ అభిమానులకు పరుగుల విందు అందిస్తున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్లో సంక్రాంతి పర్వదినం రోజు ఏకంగా నాలుగు సెంచరీలు బాదాడు. దీంతో సంక్రాంతి రోజు కోహ్లీ సెంచరీ చేయడం ఖాయమనే అభిప్రాయానికి అభిమానులు వచ్చారు.
తొలుత 2017లో సంక్రాంతి రోజు ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో 102 బంతుల్లో 122 పరుగులు చేశాడు. 2018లో సంక్రాంతి నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. 2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో 112 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 2020 నుంచి 2022 ఆసియా కప్ వరకు సెంచరీ చేయని విరాట్ కోహ్లీ.. మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాది అభిమానులకు పునకాలు తెప్పించాడు.
అటు శ్రీలంకపై మూడో వన్డేలో కోహ్లీ 166 పరుగులు చేసి భారీ సెంచరీ నమోదు చేశాడు. దీంతొ వన్డే క్రికెట్ చరిత్రలోనే నాలుగుసార్లు 150 ప్లస్ పరుగులతో అజేయంగా నిలిచిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ వన్డేల్లో ఐదుసార్లు 150+ స్కోర్లు నమోదు చేశాడు. గత నాలుగు వన్డేలలో అతడు మూడు సెంచరీలు బాదాడు. బంగ్లాదేశ్పై 113, శ్రీలంకపై 113, 166 పరుగులు చేశాడు.
సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లీ
వన్డేలలో సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డుకు కోహ్లీ మూడు సెంచరీల దూరంలో నిలిచాడు. ఓవరాల్గా 74 సెంచరీ నమోదు చేసి సచిన్ 100 సెంచరీల రికార్డు అధిగమించే దిశగా దూసుకెళ్తున్నాడు. 259 ఇన్నింగ్స్ల్లోనే కోహ్లీ 46 సెంచరీలు బాదగా.. 452 ఇన్నింగ్స్ల్లో సచిన్ 49 శతకాలు నమోదు చేశాడు. శ్రీలంకపై 10 వన్డే సెంచరీలు బాది ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.