MLA Viral Video: ప్రస్తుత కాలంలో రాజకీయం అంటే అబద్ధాల కోర్సు అని పేరుగాంచింది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వచ్చి నోటికొచ్చిన హామీలు ఇచ్చి.. ఆ తర్వాత ఐదేళ్ల వరకు ఇటువైపు కన్నెత్తి కూడా చూడారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధపడుతారు. ఆ తర్వాత ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇక ప్రజల అవసరం తీరిపోయిందంటూ వాళ్ల సమస్యలను పట్టించుకోవడం మానేస్తారు.
ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారందరూ ప్రజలకు సేవకులే. కానీ.. ఇది వ్యతిరేకమైంది. చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రజలే తమకు సేవకులుగా భావిస్తుంటారు. అందరూ మాత్రం అలా ఉండారు.. కొంతమంది ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారు. వారు అడగకముందే వారి సమçస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తూ తాము పదవిలో ఉన్నంత వరకూ ప్రజలకు సేవకులమే అంటూ వారి మాటను నిలబెట్టుకుంటుంటారు. అదే చేస్తున్నారు తమిళనాడుకు చెందిన ఓ ఎమ్మెల్యే. ఇటీవల అతను ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించగా అక్కడ టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటం గుర్తించారు. ఉపాధ్యాయులు, సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ తానే స్వయంగా చీపురు పట్టి టాయిలెట్ల గదులను శుభ్రం చేశారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్.పీ. వెంకటేశ్వరన్ ప్రజల సమస్య తెలుసుకునేందుకు ఆయన లిట్టారం అనే ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న ఇలక్కియంపట్టి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్లు అశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు.అక్కడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై మండిపడ్డారు. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తుంటే మీరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆయన స్వయంగా చీపురు పట్టి టాయిలెట్లు శుభ్రం చేశారు. ఇలానే ప్రతి రోజూ శుభ్రంగా ఉంచుకోవాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా డెవలప్ మెంట్ ఫండ్ నుంచి అత్యాధునికి సౌకర్యాలతో మరుగుదొడ్డిని నిర్మిస్తామని ఎమ్మెల్యే వెంటకటేశ్వరన్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే టాయిలెట్లు శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు సదరు ఎమ్మెల్యే పై ప్రశంసలు కురిపిస్తున్నారు.