Mahesh: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ వేసవిలో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సర్కారి వారి పాట సినిమాతో హిట్ టాక్ ను అందుకున్నారు. ప్రస్తుతం తన 28వ ప్రాజెక్టులో సినిమా చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన తన తదుపరి సినిమాలో నటిస్తున్నారు. వీరి కాంబోలో ఇప్పటికే అతడు, ఖలేజా లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వస్తోంది.
2010లో వచ్చిన ఖలేజా తర్వాత 12 ఏళ్లకు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ ఈ సినిమాతో రిపీట్ కానుంది. ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే పుష్కలంగా ఉన్నాయి. అయితే మహేష్ జీవితంలో ఈ ఏడాది వ్యక్తిగతంగా తీరని లోటు అనే చెప్పాలి. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పాటు అన్నయ్య రమేష్ బాబు కూడా మృతి చెందడంతో ఈ ఏడాది తీవ్ర విషాదం నెలకొంది. ఒకే ఏడాది తన కుటుంబంలో ముగ్గురిని కోల్పోవటం అంటే ఎవరు తీర్చలేని లోటు అనే అందరూ బాధను వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబుకు తన భార్య నమ్రత శిరోద్కర్ ఎప్పుడూ అండగా ఉంటూ వస్తోంది.
మహేష్ కెరీర్ లోకి నమ్రత ఎంటర్ అయ్యాకే అనేక విజయాలు అందుకున్నారు. నమ్రత వచ్చాకే మహేష్ కు తిరుగలేని స్టార్ డమ్ వచ్చింది. 2005లో మహేష్, నమ్రత ముంబైలో పెళ్లితో ఒక్కటయ్యారు. అంతకుముందు నాలుగేళ్ల నుంచి వీరు ప్రేమించుకున్నారు. అయితే నమ్రత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మహేష్ ముందునుంచి తనకు ఓ మంచి ఫ్రెండ్లా ఎన్నో విషయాల్లో తోడునీడగా ఉన్నాడని, అలాంటి భర్త దొరకడం అదృష్టం అని చెప్పుకొచ్చింది. ఇంట్లో మీ మధ్య చిన్నపాటి గొడవలు వస్తాయా అనే ప్రశ్నకు ఆమె బదులిచ్చింది. పిల్లల విషయంలో మాత్రం చిన్న చిన్న గొడవలు తమ మధ్య వస్తాయని నమ్రత వెల్లడించింది.