Nara Lokesh: టీడీపీ యువనేతలు నారా లోకేష్ వారిని పిలిచే తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన వయసుకు అటూ ఇటూ ఉన్న యువ నేతల్ని లోకేశ్ ఏరా, రేయ్ అంటూనే పేరు పెట్టి పిలవడం పై అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. మనసులోని ఆవేదనను ఎలా బయట పెట్టాలో తెలియని పరిస్థితిలో సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నారు. కాగా ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖుడి కుమారుడు, అలాగే అత్యున్నత చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న యువ నాయకుడిని, విశాఖకు చెందిన మాజీ మంత్రి కుమారుడిని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా యువ నేతలందరినీ లోకేశ్ రేయ్ అని పిలుస్తుండడంపై పెద్ద ఎత్తున టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.
రేయ్, ఏరా, పోరా అని పిలవడం వెనుక కలుపుగోలు తనం, ఆత్మీయత దాగి ఉన్నాయని లోకేశ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలకు మాత్రం అలా పిలవడం ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే బాల్యం నుంచి స్నేహం ఉన్న వాళ్ల మధ్య అలాంటి పిలుపు ఉన్నా పట్టించుకోనవసరం లేదని, కేవలం లోకేశ్ ఒక్కరే పిలవడం, అటు వైపు నుంచి సార్, అన్నా అని పిలుస్తుండడాన్ని గుర్తు చేస్తున్నారు. అవమానించాలనే ఉద్దేశంతో లోకేశ్ పిలుస్తుండకపోవచ్చని, కానీ పిలిపించుకునే వాళ్ల మానసిక స్థితిని కూడా ఆయన అర్థం చేసుకుని మెలిగితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొందరు టీడీపీ యువనేతలు తమను లోకేశ్ రేయ్, ఏరా అని పిలవడాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి బాధపడినట్టు తెలుస్తోంది. అయితే లోకేశ్కు యువనేతల బాధ గురించి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా లోకేశ్ ఎదుటి వాళ్ల మనోభావాలను గ్రహించి పిలిస్తే బాగుంటుంది. కనీసం పేరు పెట్టి పిలవకపోయినా కూడా ఏం బాబు, తమ్ముడు ఇలా పిలిచినా కూడా బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కొందరు స్పందిస్తూ నారా లోకేష్ కి నమస్కారం తెలియదు అంటూ మండిపడుతున్నారు.