Zimbabwe: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో పలు సంచలన విజయాలు నమోదుచేసి అంచనాలకు మించి రాణించిన ఆఫ్రికా దేశం జింబాబ్వే కథ ముగిసింది. క్వాలిఫికేషన్ రౌండ్లో ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి జట్లను ఓడించిన ఆ జట్టు.. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి సూపర్-12కు అర్హత సాధించింది. సూపర్ – 12లో గ్రూప్-2లో చేరిన ఆ జట్టు.. ఈ దశలో కూడా పాకిస్తాన్ వంటి పటిష్ట జట్టుకు షాకిచ్చింది. గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో ఉన్న భారత్, బంగ్లాదేశ్ తో పాటు ఆ జట్టు కూడా ఉండేది. కానీ బుధవారం నెదర్లాండ్స్తో ముగిసిన పోరులో ఆ జట్టు ఓడటంతో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
సూపర్ -12లో జింబాబ్వే తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడింది. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్లో ఫలితం తేలలేదు. రెండో మ్యాచ్లో పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. దీంతో జింబాబ్వే కూడా సెమీస్ రేసులోకి వచ్చింది. బంగ్లాదేశ్తో ముగిసిన మ్యాచ్లో కూడా విజయపు అంచుల దాకా వచ్చినా 3 పరుగుల తేడాతో ఓడింది.
ఇక బుధవారం నెదర్లాండ్స్తో మ్యాచ్లో ఆ జట్టుకు అదృష్టం కలిసిరాలేదు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ లోనూ విఫలమై దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగి 19.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ కాగా.. లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 18 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పలితంగా సెమీస్ రేసు నుంచి ఆఫ్రికన్ జట్టు నిష్క్రమించింది. ఈ ఓటమితో టోర్నీ నుంచి కూడా ఆ జట్టు అనధికారికంగా వైదొలిగినట్టే.
జింబాబ్వే ఓటమి భారత్ సెమీస్ రేసుకు కలిసివచ్చేదే. బంగ్లాదేశ్తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఫలితం తేడా కొడితే భారత్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. అలా కాకుండా గెలిస్తే రోహిత్ సేనకు ఇబ్బందులే లేవు. జింబాబ్వే ఎలాగూ టోర్నీ నుంచి నిష్క్రమించింది గనక భారత్ కు ప్రధాన పోటీదారు ఇప్పుడు బంగ్లాదేశ్ మాత్రమే..! భారత్ ఈ మ్యాచ్ లో ఓడినా జింబాబ్వేతో మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ రేసులో ఉంటుంది. బంగ్లాదేశ్ తమ తర్వాత మ్యాచ్ ను పాకిస్తాన్తో ఆడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ ఫలితం కూడా భారత సెమీస్ అవకాశాలపై పడనుంది. మరి అడిలైడ్లో భారత్ ఏం చేస్తుందనేది కొద్దిసేపట్లో తేలనుంది.