ODI World Cup: ఇటీవల టీమిండియా ప్రదర్శన రెండు అడుగులు ముందుకి.. ఒక అడుగు వెనక్కి అన్నట్లు సాగుతోంది. బంగ్లాదేశ్లో వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత మన జట్టు ప్రదర్శనపై అందరిలోనూ భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇలాంటి టీమ్తో ప్రపంచకప్ ఎలా గెలుస్తారంటూ మాజీ క్రికెటర్లు చీవాట్లు పెట్టారు. అయితే శ్రీలంకతో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి తమలో సత్తా తగ్గలేదని టీమిండియా నిరూపించింది. అయితే ముందుంది ముసళ్ల పండగ అని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీలంకతో సిరీస్ తర్వాత రెండు బలమైన జట్లతో స్వదేశంలో టీమిండియా తలపడబోతోంది. తొలుత న్యూజిలాండ్తో వన్డేలు, టీ20లు ఆడనున్న భారత జట్టు ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టులు, వన్డేలలో ఢీకొట్టనుంది. వన్డేలలో శ్రీలంకను క్వీన్ స్వీప్ చేసిన టీమిండియా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపైనా అదే ప్రదర్శన చేస్తుందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బంగ్లాదేశ్పై మనోళ్లు వన్డే సిరీస్ ఓడిపోయిన ఘటనను చాలామంది గుర్తుచేస్తున్నారు.
అయితే ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు. శ్రీలంకతో గొప్ప ప్రదర్శన చేసిన తాము న్యూజిలాండ్ను ఓడించడం అంత సులువైన పనికాదని స్పష్టం చేశాడు. ఆ జట్టు పాకిస్థాన్లో సిరీస్ గెలిచి వస్తుందని.. కాబట్టి ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దని సహచరులను సున్నితంగా హెచ్చరించాడు. న్యూజిలాండ్తోనూ గొప్పగా రాణిస్తే వన్డే ప్రపంచకప్కు తమ టీమ్ కాంబినేషన్ సెట్ అవుతుందని స్పష్టం చేశాడు.
తొలి వన్డే హైదరాబాద్లోనే..!!
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా బుధవారం నాడు తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్లో అడుగుపెట్టగా.. టీమిండియా సోమవారం చేరుకోనుంది. గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో టిక్కెట్ల లొల్లి చోటు చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజకీయాల కారణంగా టిక్కెట్ల అమ్మకాల్లో తొక్కిసలాట జరిగింది. అయితే ఈసారి టిక్కెట్లను ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో విడతల వారీగా విక్రయిస్తున్నారు.