BCCI: వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. గతేడాది టీమిండియా ప్రదర్శనపై రివ్యూ నిర్వహించేందుకు ఇటీవల ముంబైలో బీసీసీఐ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఎన్సీఏ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పాల్గొన్నారు. ఇక బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
టీమిండియా ప్రదర్శన, మెగా టోర్నీలపై ఐపీఎల్ ప్రభావం, ప్లేయర్లు గాయాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిట్నెస్కు సంబంధించిన యోయో టెస్టు, ఐసీసీ నిర్వహించే ఈవెంట్లపై ఫోకస్ పెట్టడం.. లాంటి అంశాలపై అందరూ కలిసి చర్చించుకున్నారు. ఈ క్రమంలో కొత్త నిర్ణయాలు, కాస్త కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్టార్ ప్లేయర్లను ఐపీఎల్కు దూరంగా ఉండాలని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది.
వన్డే ప్రపంచ కప్ మనదేశంలోనే ఈ ఏడాది జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచి కసరత్తులు మొదలు పెట్టింది బీసీసీఐ. ఇందులో భాగంగా ఇప్పటికే 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసింది. ఐపీఎల్ ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలని కొందరు ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేసింది బీసీసీఐ. ఆటగాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫిట్గా ఉండాలని, గాయాలబారిన పడకుండా చూసుకోవాలని చెప్పింది. వన్డే వరల్డ్కప్ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికార వర్గాలు వెల్లడించాయి.
వన్డేలపై ఫోకస్
మరోవైపు ఈ ఏడాది టీమిండియా 35 వన్డేలు ఆడనుంది. ఇందులో భాగంగా శ్రీలంకతో స్వదేశంలోనే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది భారత్. గతేడాది భారత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో ఘోరంగా విఫలైంది. టీ20 వరల్డ్కప్ చేజారిపోయింది. ఆసియా కప్లో గెలవాల్సిన మ్యాచ్లలో దారుణంగా ఓడిపోయింది. ఫ్యాన్స్ నుంచి తవ్రమైన నెగిటివ్ కామెంట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్లోనూ ఇలాగే చేతులెత్తేయకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలని బీసీసీఐ భావిస్తోంది. ఆ దిశగా ఆటగాళ్లను అప్రమత్తం చేస్తోంది బీసీసీఐ.