Modi-Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ నూతన భవన సముదాయాల నిర్మాణాలకు మోదీ శంకుస్థాపన చేసేందుకు ఏపీ వస్తున్నారు. కానీ మోదీ పర్యటన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత మోదీని కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు 10 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యేందుకు పవన్ కు మోదీ నుంచి అపాయింట్ మెంట్ వచ్చింది.
ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలను మోదీకి పవన్ వివరించే అవకాశముంది. చాలారోజుల తర్వాత మోదీని పవన్ కలుస్తుండటం, ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా పవన్ గట్టిగా గళం విప్పుతున్న క్రమంలో మోదీతో పవన్ ఏం చర్చిస్తారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోకుండా అడ్డుకోవడం లాంటి విషయాలను మోదీకి పవన్ వివరించే అవకాశముంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న పవన్.. శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విశాఖకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు విశాఖలోనే ఉండనున్నారు. మోదీ పర్యటన సమయంలో రెండు రోజుల పాటు పవన్ విశాఖలో ఉండనుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇక జగన్ కూడా విడిగా మోదీతో భేటీ కానున్నారు.
ఇక ప్రధాని మోదీతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో జగన్ పాల్గొనున్నారు. దీంతో పవన్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. దీంతో విడిగా మోదీతో భేటీ అయ్యేందుకు పవన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు పీఎంవో కార్యాలయం నుంచి జనసేన వర్గాలకు సమాచారం అందింది. దీంతో మోదీతో పవన్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.