Sarath Kumar: ఏ భాష నటులనైనా చేరదీసే మంచి గుణం తెలుగు ప్రేక్షకులకే ఉంది. భాషా భేదాల్లేకుండా అందరు నటుల్ని ఆదరించడం టాలీవుడ్ ఆడియెన్స్ కే చెల్లుతుంది. నటన బాగుంటే చాలు వారిని మనోళ్లు గుండెల్లో పెట్టుకుంటారు. అందుకు రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ లాంటి వాళ్లే ఉదాహరణ. ముఖ్యంగా రజినీ, కమల్ లను తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఆరాధిస్తారు. కమల్ హాసన్ కైతే తమిళంలో కంటే తెలుగులోనే హిట్లు ఎక్కువ. ఆయన నటనకు మన వాళ్లు ఇచ్చే గౌరవం అది.
రజినీకాంత్, కమల్ హాసన్ లతోపాటు మరికొందరు తమిళుల్ని మనోళ్లు అక్కున చేర్చుకున్నారు. వారిలో శరత్ కుమార్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఇక్కడ రాణించారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కెరీర్ మొదట్లో నటించిన ‘బన్నీ’ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో ఆయన కనబర్చిన నటన అద్వితీయమనే చెప్పాలి. అలాంటి శరత్ కుమార్ ఇప్పుడు అస్వస్థతకు గురయ్యారు.
అభిమానుల్లో కలవరం
డయేరియాతో శరత్ కుమార్ డీహైడ్రేషన్ కు గురయ్యారని తెలుస్తోంది. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో తమిళ సినీ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. శరత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇకపోతే, శరత్ కుమార్కు డిసెంబర్ 2020లో కరోనా సోకింది. అయితే ఆయన త్వరగానే కోలుకున్నారు. ఆ తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన పీఎస్ 1 బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి తరుణంలో శరత్ మళ్లీ అనారోగ్యం పాలవ్వడం ఆయన అభిమానుల్ని కలవరపెడుతోంది.