Rain: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాను వరుణుడు వెంటాడుతున్నాడు. టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, చివరి మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. దాంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చగా స్కోర్లు టై అయ్యాయి. రెండో వన్డే కూడా వర్షంతో రద్దయ్యింది.
వర్షం గ్యారెంటీ..
ఇప్పటికే తొలి వన్డేలో ఓడిన టీమిండియాకు మూడో వన్డే ఎంతో కీలకం. అది గెలిస్తేనే సిరీస్ డ్రా అవుతుంది. లేదంటే సిరీస్ కోల్పోవాల్సి వస్తుంది. అయితే మూడో వన్డే జరిగే క్రైస్ట్ చర్చ్లో కూడా వర్షం పడే అవకాశాలున్నాయి. 93 శాతం ఆకాశాన్ని మబ్బులు కమ్మేయనున్నాయని, ఏడు శాతం ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఈ క్రమంలో అటు ఆటగాళ్లతోపాటు టీమిండియా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేపు ఒక్కరోజు వర్షం పడకుండా ఉండాలని ప్రార్థిస్తున్నారు. కాగా, క్రైస్ట్ చర్చ్లో హాగ్లే ఓవల్ పిచ్ భిన్నంగా ఉంటుంది. అటు బ్యాటర్లు ఇటు బౌలర్లకు సహకరిస్తోంది. ఈ వేదికగా భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మైదానంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 262గా ఉంది. కాగా, మూడో వన్డేలోనూ గెలవాలని న్యూజిలాండ్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.