Gautam Gambhir: టీ20 ప్రపంచకప్లో టీమ్ ఇండియా తన రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సూపర్-12లో భాగంగా గ్రూప్-2లో గురువారం నెదర్లాండ్స్ తో భారత జట్టుకు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 56 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత ఓవర్లో 179/2 పరుగులు చేసింది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (53), కోహ్లీ (62 నాటౌట్), సూర్యకుమార్ (51 నాటౌట్) పరుగులు చేశారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 180 పరుగుల లక్ష్య ఛేదనలో పసికూన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో కేవలం 123/9 పరుగులకే పరిమితమైంది. టిమ్ ప్రింగ్లే (20), షరీజ్ అహ్మద్ (16 నాటౌట్), వాన్ మీక్రెన్ (14 నాటౌట్) పరుగులు చేశారు. అలాగే ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా బౌలర్లు తమ సత్తా చాటారు. భువనేశ్వర్, అర్షదీప్, అక్షర పటేల్, అశ్విన్ మెరుగ్గా రాణించారు.
చెలరేగిన సూర్య..
ఫ్రెడ్ క్లాస్సెన్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. విరాట్ కోహ్లీతో కలిసి దూసుడు పెంచాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్యకుమార్ 51 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం ట్విట్టర్ వేదికగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ‘చాలా మంది విరాట్ కోహ్లీని రియల్ హీరోగా భావిస్తున్నారు. కానీ రియల్ హీరో విరాట్ కోహ్లీ కాదు.. సూర్యకుమార్ యాదవ్. అందుకే అతనిపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఇటీవల మెల్బోర్న్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (82) పరుగులు చేశాడు.