Ricky Ponting: ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఆసీస్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో కామెంటేటర్గా పని చేస్తున్న రికీ పాంటింగ్.. కామెంట్రీ ఇస్తుండగానే అస్వస్థతకు గురయ్యారు. పాంటింగ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మూడో రోజు టెస్టు సందర్భంగా ఛాతిలో అసౌకర్యంగా ఉందంటూ ఉన్నఫళంగా ఆస్పత్రిలో చేరాడు పాంటింగ్.
రికీ పాంటింగ్ అనారోగ్యానికి గురయ్యారని, కామెంట్రీ ఇవ్వడం సాధ్యం కాదని బ్రాడ్ కాస్టింగ్ ఛానల్ సెవెన్ ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ప్రస్తుతం పాంటింగ్ ఆరోగ్యంగానే ఉన్నారని సన్నిహతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆసీస్ పలువురు దిగ్గజ క్రికెటర్లను కోల్పోయింది. గుండెపోటుతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రాడ్ మార్ష్, షేన్ వార్న్ ప్రాణాలు కోల్పోయారు.
వీరిద్దరికంటే ముందే ఆసీస్ మాజీ ఆటగాడు డోన్ జోన్స్ కూడా కన్నుమూశాడు. ఇలా ఆసీస్ క్రికెట్లో సీనియర్లు కన్నుమూయడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. తాజాగా పాంటింగ్ ఆస్పత్రిపాలయ్యాడనే వార్తతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, పాంటింగ్ ఆరోగ్యం కుదుటపడిందన్న వార్తలతో అభిమానులు ఊరట చెందుతున్నారు.
చెరిగిపోని రికార్డులు పాంటింగ్ సొంతం..
వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్, కెప్టెన్లలో పాంటింగ్ ఒకడు. టెస్టుల్లో 13,378 పరుగులు, వన్డేల్లో 13,704 పరుగులు చేసిన పాంటింగ్.. 1995 నుంచి 2012 వరకు ఆసీస్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన కాలంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రధాన ప్రత్యర్థుల్లో పాంటింగ్ ఒకడిగా ఉండేవాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో పాంటింగ్ 71 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా 71 సెంచరీలతో పాంటింగ్తో సరిసమానంగా ఉన్నాడు.