Rishabh Pant: టీమిండియా కీలక వికెట్ కీపర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ అనుకోనిరీతిలో రోడ్డుప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఇప్పటికే అతడికి సర్జరీ జరిగింది. పంత్కు తీవ్రగాయాలు కావడంతో గాయాలు తగ్గినా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో పంత్ దూరం కానున్నాడు. సుమారు ఆరునెలల పాటు అతడు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్లకు పంత్ను బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఇటీవల సిరీస్లలో అతడు పేలవ ప్రదర్శన చేయడంతో పంత్కు విశ్రాంతి ఇచ్చారు. అయితే స్వదేశంలో త్వరలో జరిగే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు కూడా పంత్ దూరం కానున్నాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ ఆటగాడు సాహాను పక్కనపెట్టి రిషబ్ పంత్ను ప్రధాన వికెట్ కీపర్గా కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం పంత్ కూడా జట్టుకు దూరం కావడంతో బ్యాకప్ వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు కేఎస్ భరత్కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. 2021లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భరత్కు తొలిసారిగా అవకాశం వచ్చింది. కానీ సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా కారణంగా తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదే సిరీస్లో రెండో టెస్టులో సబ్స్టిట్యూట్గా వచ్చిన భరత్ తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నాడు.
ఇషాన్ కిషన్ నుంచి భరత్కు పోటీ
దేశీవాళీ క్రికెట్లో కేఎస్ భరత్కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 4500 పరుగులు చేసిన భరత్.. 9 సెంచరీలతో పాటు 25 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అయితే టీమిండియాకు పంత్ దూరమైన నేపథ్యంలో కేఎస్ భరత్కు ఇషాన్ కిషన్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. బంగ్లాదేశ్పై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్కు మూడు ఫార్మాట్లలో అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.