Rishabh: ఇటీవల కారు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు. ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్సులో ముంబైకి తరలించారు. విమానంలో ప్రయాణించే స్థితిలో లేని పంత్ను ఎయిర్ అంబులెన్సులో తరలించినట్లు బీసీసీఐ వెల్లడించింది. ముంబై ఆస్పత్రిలో పంత్కు మోకాలి శస్త్ర చికిత్స జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.
అటు పంత్ గాయాల నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరికాస్త సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో డాక్టర్ దిన్షా పర్దీవాల్ ప్రత్యక్ష పర్యవేక్షణలో రిషబ్ పంత్ చికిత్స పొందనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అతడి లెగ్మెంట్లో చీలిక ఉందని.. దానికి శస్త్ర చికిత్స జరుగుతుందని వివరించింది. పంత్ పూర్తిగా కోలుకునే వరకు బీసీసీఐ వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తూనే ఉంటుందని పేర్కొంది.
తన హోంటౌన్ రూర్కీ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా రిషబ్ పంత్ డిసెంబర్ 30న రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. కారు ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. పంత్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి వేగంగా రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అతడి నుదురు, మోకాలు, ఎడమ కన్ను, మణికట్టు, మడమ వద్ద తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పంత్ ఎడమ కనుబొమ్మపై ప్లాస్టిక్ సర్జరీ కూడా జరిగింది.
ఐపీఎల్ మొత్తానికి పంత్ దూరం
కారు ప్రమాదానికి గురి కావడంతో రిషబ్ పంత్ చాలా కాలం పాటు ఆటకు దూరం కానున్నాడు. దీంతో స్వదేశంలో వచ్చే నెల 9 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్కు కూడా దూరమవనున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తం దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్న అతడు లేని లోటు ఆ జట్టుకు పూడ్చడం కష్టమే. మరి అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న విషయం ఉత్కంఠ రేపుతోంది.