Rohit-Virat: టీ20 ప్రపంచ కప్లో టీమిండియాకు సెమీస్ గండం తగిలింది. గతం కంటే భిన్నంగా ఈసారి రోహిత్ శర్మ భారత్ను విశ్వ విజేతగా నిలుపుతాడని చాలా మంది ఆశపడ్డారు. అయితే, అది జరగలేదు. గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియా తడబాటుకు గురవుతోంది. తొలి టీ20 వరల్డ్ కప్లో ధోని ఆధ్వర్యంలో నెగ్గినది ఒక్కటే భారత్కు ఊరట లభించే అంశం. తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్ కూడా మహేంద్రుడి నాయకత్వంలో గెలిచిందే. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ సైతం ధోని సారథ్యంలో గెలిచారు.
ఆ తర్వాత భారత్ తడబాటుకు గురవుతోంది. 2015 వన్డే వరల్డ్ కప్లో సెమీస్, 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో, 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సెమీస్, 2019 వన్డే వరల్డ్ కప్ లో అనూహ్యంగా కివీస్ చేతిలో సెమీస్లో పరాజయం, ఇక లేటెస్ట్గా 2021 ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ భారత్ పరాజయం చవిచూసింది. ఇలా అనేక సార్లు రెండు మెట్లు ఎక్కాల్సిన చోట కిందకు పడిపోతోంది. ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ మిగులుతోంది.
ఈ నేపథ్యంలో 2021 తర్వాత టీమిండియాలో భారీ మార్పులు జరిగాయి. కోచ్గా ద్రవిడ్ వచ్చాడు. తర్వాత కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. మరోవైపు రోహిత్శర్మపై నమ్మకం ఉంచిన బీసీసీఐ.. ఎలాగైనా కప్పు సాధిస్తాడని భావించింది. అనూహ్యంగా భారత్కు ఎదురుదెబ్బ తప్పలేదు.
కోహ్లీ, రోహిత్ దూరం..
పోటీ ప్రపంచ కప్లో సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది టీమిండియా. ఇక తాజాగా కోచ్ ద్రవిడ్ విశ్రాంతి కోరడంతో బీసీసీఐ అంగీకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెలలోనే కివీస్తో వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్లకు కోహ్లీ, రోహిత్ దూరంగా ఉండబోతున్నారు. వన్డేలకు ధవన్, టీ20లకు పాండ్యా సారథ్యం వహిస్తారు. కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఈనెల 18, 20, 22తేదీల్లో మూడు టీ20లు, 25, 27, 29 తేదీల్లో 3 వన్డేలు టీమిండియా, కివీస్ మధ్య జరగనున్నాయి.