Prabhas: బాహుబలి సినిమా తర్వాత తెలుగు హీరోలకు బాగా డిమాండ్ పెరిగింది. బాహుబలి సిరీస్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. ప్రస్తుతం ఆయనకు అధిక మార్కెట్ ఉందని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు చేస్తూ ప్రభాస్ ముందుకు సాగుతున్నాడు. అయితే ఆ లెవల్లో విడుదలైన రాధేశ్యామ్ సినిమా ఆశించిన ఫలితం రాలేదు. కానీ కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది.
ప్రస్తుతం ప్రభాస్ మూడు బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రామాయణ కథాంశంతో తెరకెక్కే ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఆ సినిమా ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. అయితే టీజర్ అంతగా బాలేదని టాక్ రావడంతో అన్నింటినీ సరిచేసి మళ్లీ తిరిగి వస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇకపోతే ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమా చేస్తున్నాడు.
కేజీఎఫ్ సిరీస్ చేసిన ప్రశాంత్ నీల్ అదే ఫామ్ లో సలార్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది.
ఇకపోతే తాజాగా ప్రభాస్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. ప్రముఖ హాలీవుడ్ సంస్థ ప్రభాస్ కు 1000 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందని సమాచారం. అవతార్ తరహా సినిమా కోసం ఈ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించే సమయంలో ప్రభాస్ మరో సినిమాలో నటించకూడదని ఆ సంస్థ షరతు కూడా విధించినట్లు సమాచారం. ఏదేమైనా ప్రభాస్ భారీ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలుస్తోంది.