Sanju Samson: న్యూజిలాండ్తో ఆదివారం జరగాల్సిన రెండో వన్డే వర్షంవల్ల రద్దయ్యింది. 12.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమయ్యింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా.. ముందుగా బ్యాటింగ్కు దిగింది. జట్టులో రెండు మార్పులు చేసిన గబ్బర్ సేన.. సంజూ శాంసన్తో పాటు శార్దూల్ ఠాకూర్పై వేటు వేసి దీపక్ హుడా, దీపక్ చాహర్లను తీసుకుంది. కివీస్ పర్యటనలో టీ20 సిరీస్లో సంజూకు ఛాన్స్ రాలేదు. మొదటి వన్డేలో అవకాశం రాగా, రెండో వన్డేలో తొలగించారు. దీంతో అభిమానులు ఫైరవుతున్నారు.
ఆరో బౌలర్ కావాలనుకున్నాం..
మ్యాచ్ ఆగిపోయిన తర్వాత.. భారత జట్టులో జరిగిన రెండు మార్పులపై అడిగిన ప్రశ్నకు శిఖర్ ధావన్ స్పందించాడు. తొలి వన్డేలో బౌలింగ్ తేలిపోవడంతో ఆరో బౌలర్ను కావాలనుకున్నామని, అందుకనే సంజు శాంసన్ను పక్కనపెట్టి హుడాను తీసుకున్నట్టు చెప్పాడు. చాహర్ రెండు వైపుల నుంచి బంతిని స్వింగ్ చేయగలడని అందుకనే తుది జట్టులో అతడికి చోటిచ్చినట్టు వివరించాడు. అయితే మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిందన్నారు. అన్నీ మన నియంత్రణలో ఉండవన్నాడు.
పిచ్ మాత్రం బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా అనిపించిందని, శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడాడని తెలిపాడు. ఇక చివరి వన్డేపై దృష్టిసారిస్తామని చెప్పాడు. తమ జట్టులో చాలా మంది రెస్ట్లో ఉన్నారని, అయినప్పటికీ చాలా బలంగా ఉన్నామని పేర్కొన్నాడు. టీమ్ఇండియాను నడిపించడం ఎప్పుడూ గర్వకారణమేనని తెలిపాడు.
కాగా, భారత జట్టులో సంజూకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అభిమానులు మండిపడ్డారు. వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ను కొనసాగిస్తూ.. సంజూను పక్కనపెట్టడం సమంజసం కాదంటున్నారు. సౌత్ ఇండియన్ ప్లేయర్ కాబట్టే సంజూపై వివక్ష చూపుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.