Security: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏలాగైనా గద్దె దింపాలని సాయశక్తులా కష్టపడుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. అటు సినిమా షూటింగ్లోనూ పాల్గొంటున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు రెక్కీ నిర్వహించినట్లు జన సైనికులు ఆరోపించారు. ఈ క్రమంలో జనసేనాని భద్రత విషయంలో అభిమానులు, అనుచరులు భయాందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉందని, సెక్యురిటీ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని తెలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి తెలంగాణ ప్రభుత్వంతో విచారణ జరిపించారు. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ జరగలేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కొందరు వ్యక్తులు సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినట్లు తెలిపారు. అయినా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వింగ్లో కొత్తగా సిబ్బంది చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసిన పది మంది మాజీ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కోసం నియమించబడినట్లు సమాచారం. ఇంటి బయట రోడ్డుపై సెక్యూరిటీ సిబ్బందితో చర్చించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిరంతరంగా షూటింగ్ జరుగుతోంది. పవన్ రాజకీయ పరమైన విషయాలను చూసుకుంటూనే.. సినిమా షూటింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ బీఎండబ్ల్యూ బైక్పై దూసుకెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా చిత్రీకరణలో భాగంగా పవన్ కళ్యాణ్ బైక్పై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎంఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.