Sanju Samson: టీమిండియాను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయం కారణంగా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు దూరంగా ఉన్నాడు. తాజాగా శ్రీలంకతో తొలి టీ20లో యువ ఆటగాడు సంజు శాంసన్ కూడా గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ వెల్లడించింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సంజూ మోకాలికి గాయమైనట్లు బీసీసీఐ తెలిపింది.
గాయం కారణంగా మిగతా రెండు టీ20లకు సంజు శాంసన్ దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. శాంసన్కు స్కాన్స్ తీయించామని, నిపుణులు అతడికి విశ్రాంతి అవసరం అని చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. అతడి స్థానంలో విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. అతడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున రాణించాడు.
కాగా రాక రాక వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ ఉపయోగించుకోలేదు. శ్రీలంకతో ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20లో కేవలం 5 పరుగులకే సంజు శాంసన్ అవుటయ్యాడు. ఇది చూసిన చాలా మంది సంజూకు అవకాశాలు రావడమే గగనం అని.. అలా వచ్చిన అవకాశాలను ఇలా చేజేతులారా నాశనం చేసుకోవడం ఏంటి అని అక్కసు వెళ్లగక్కుతున్నారు. మరికొంతమంది మాత్రం కావాలనే శాంసన్ను పక్కనపెట్టారని.. ఇంత పక్షపాతం చూపించడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు.
శాంసన్ ప్రదర్శనపై గవాస్కర్ ఫైర్
శ్రీలంకతో తొలి టీ20లో సంజూ శాంసన్ ఔటైన తీరును మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని, చెత్త షాట్తో మూల్యం చెల్లించుకున్నాడని మండిపడ్డాడు. భారీ షాట్ ఆడాలనే ఆతృతలో మూల్యం చెల్లించుకున్నాడని అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్ మెరుగైన ఆటగాడు అని.. అతడిలో చాలా టాలెంట్ ఉందన్నాడు. కానీ శాంసన్ షాట్ సెలక్షన్ మాత్రం కరెక్ట్గా లేదన్నాడు.