SuryaKumar Yadav: టీ20 ఫార్మాట్లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ అద్భుత రీతిలో దూసుకుపోతున్నాడు. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల శ్రీలంకతో మూడో టీ20లో సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలో అతడు చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ర్యాంకుల్లో తన రేటింగ్ పాయింట్లను సూర్యకుమార్ భారీగా పెంచుకున్నాడు.
తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో సూర్యకుమార్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. దీంతో ర్యాంకుల విషయంలో 900 అంతకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్లు సంపాదించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఇప్పటివరకు టీ20 ర్యాంకుల చరిత్రలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే 900 మార్క్ అందుకున్నారు. వారిలో ఒకరు ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ కాగా రెండో ఆటగాడు సూర్యకుమార్.
2020లో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ 915 పాయింట్లు సాధించాడు. అతడి తర్వాత సూర్యకుమార్ మాత్రమే 900కు పైగా రేటింగ్ పాయింట్లను సాధించాడు. మరోవైపు ఇటీవల శ్రీలంకపై సెంచరీ చేయడంతో ఏకంగా 20 రేటింగ్ పాయింట్లను సూర్యకుమార్ పెంచుకున్నాడు. ఇది అతడి అంతర్జాతీయ టీ20 కెరీర్లో మూడో సెంచరీ కావడం విశేషం.
తొలి, రెండో ర్యాంకులకు భారీ తేడా
ఐసీసీ టీ20 ర్యాంకుల్లో సూర్య తర్వాత పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో ఉన్నాడు. 836 రేటింగ్ పాయింట్లతో అతడు రెండో స్థానంలో ఉన్నాడు. దాదాపుగా తొలి, రెండో ర్యాంకులకు 70 పాయింట్లు తేడా ఉండటం గమనించాల్సిన విషయం. డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రోసౌ, అరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో కొనసాగుతున్నారు.