T20: ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్కు చేరకుండానే ఓడిపోవడంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే జట్టును తయారుచేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీ20ల నుంచి రోహిత్ను కెప్టెన్గా తప్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇన్ సైడ్ స్పోర్ట్స్ తన కథనంలో పేర్కొంది. 2021 టీ20 ప్రపంచకప్లో దారుణ ఓటమి అనంతరం కోహ్లీని తప్పించిన తరహాలో ఇప్పుడు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను రెగ్యులర్ కెప్టెన్ చేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం న్యూజిలాండ్లో జరుగుతున్న టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. దీంతో రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్ లాంటి ఆటగాళ్లు దూరమయ్యారు. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. న్యూజిలాండ్ పర్యటన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో మూడు వన్డేలు, మూడు టీ20లను శ్రీలంక ఆడాల్సి ఉంది.
శ్రీలంకతో టీ20 సిరీస్కు ముందే హార్దిక్ పాండ్యాను టీ20ల్లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్గా బీసీసీఐ నియమించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం రోహిత్ వయసును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కెప్టెన్సీ మార్పు చేసేందుకు సిద్ధమైనట్లు కొందరు బీసీసీఐ అధికారులు లీకులు ఇస్తున్నారు. 2024 నాటికి రోహిత్ టీ20 ప్రపంచకప్లో ఆడే అవకాశం లేదని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా కెప్టెన్ ఎంపిక?
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా తన జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు. ఆ తర్వాత ఐర్లాండ్తో జరిగిన టి20 సిరీస్లో కూడా టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కంటే పాండ్యానే బెటర్ అన్న ఉద్దేశంలో బీసీసీఐ కనిపిస్తోంది.