T20 WC 2022: పొట్టి ప్రపంచకప్లో భారీ ఆశలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన అఫ్గానిస్తాన్కు ఏదీ కలిసిరాలేదు. గ్రూప్ ఆఫ్ డెత్ గా ఉన్న గ్రూప్-1లో ఉన్న అఫ్గాన్.. ఈ టోర్నీలో దారుణంగా విఫలమైంది. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఆసియాకప్లో సంచలన ఆటతీరుతో ప్రశంసలు అందుకున్న అఫ్గాన్ జట్టు.. ప్రపంచకప్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కాగా అఫ్గాన్ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు సారథి మహ్మద్ నబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
శుక్రవారం ఆస్ట్రేలియా-అఫ్గానిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్లో తమ జట్టు ఓటమి తర్వాత మహ్మద్ నబీ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘మా టీ20 ప్రపంచకప్ ప్రయాణం నేటితో ముగిసింది. ఈ టోర్నీలో మాకు గానీ, మా జట్టు అభిమానులకు గానీ ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నా. సంవత్సర కాలంగా మా జట్టు సన్నద్ధత సరిగా లేదు. కొన్ని పర్యటనలలో టీమ్ మేనేజ్మెంట్, నేను ఒకే లైన్లో లేము. ఇది జట్టు సమతుల్యత మీద తీవ్ర ప్రభావం చూపింది. అందుకే నేను కెప్టెన్గా తప్పుకుంటున్నా.. కానీ ఆటగాడిగా కొనసాగుతా..’ అని తెలిపాడు.
ఇన్నాళ్ల తన క్రికెట్ జర్నీలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా నబీ కృతజ్ఞతలు తెలిపాడు. 2013 నుంచి అఫ్గాన్ సారథ్య బాధ్యతలు మోస్తున్న నబీ.. ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. అతడి సారథ్యంలో అఫ్గాన్ తొలిసారి టెస్టు హోదా దక్కించుకుంది. 28 వన్డేలు, 35 టీ20లలో తన జట్టు తరఫున సారథ్యం వహించిన నబీ.. అఫ్గాన్ జట్టును విజయపథాన నిలిపాడు.
ఇక టీ20 ప్రపంచకప్లో అఫ్గానిస్తాన్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో ఆ జట్టు.. మూడు మ్యాచ్ లు ఆడి మూడింటిలో ఓడింది. రెండు మ్యాచ్లలో వర్షం కారణంగా ఫలితం తేలలేదు.
— Mohammad Nabi (@MohammadNabi007) November 4, 2022