T20 World Cup 2022: గతనెల 16న మొదలైన టీ20 ప్రపంచకప్ కీలక దశకు చేరుకున్నది. అక్టోబర్ 21 నుంచి ఆడుతున్న సూపర్-12 దశకు నేటితో తెరపడింది. పలు సంచలన మ్యాచ్లు, అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చిన పసికూనలు, మారిన సమీకరణాలు, అవకాశమే లేదనుకున్న జట్లు టాప్లో నిలవడం, టోర్నీ ఫేవరేట్లుగా ఉన్న జట్లు అనూహ్యంగా వెనుదిరగడం.. వెరసి పొట్టి ప్రపంచకప్లో సూపర్-12 దశ ముగిసింది. ఇక మిగిలింది రెండు సెమీస్లు, ఫైనల్ మాత్రమే.
నేడు గ్రూప్-2లో ముగిసిన మూడు మ్యాచ్లతో సూపర్-12కు శుభం కార్డు పడింది. ఆదివారం సౌతాఫ్రికా-నెదర్లాండ్స్, పాకిస్తాన్ – జింబాబ్వే, ఇండియా-జింబాబ్వే మధ్య మ్యాచ్లు జరిగాయి. ఈ పోటీలలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఓడగా గెలిచిన ఇండియా, పాకిస్తాన్ లు సెమీస్ కు చేరాయి. చివరి లీగ్ మ్యాచ్ లో జింబాబ్వే ను టీమిండియా.. 71 పరుగుల తేడాతో ఓడించింది. ప్రస్తుతం గ్రూప్ – 2లో ఇండియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత పాకిస్తాన్.. 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
సెమీస్లో ఎవరితో ఎవరు..?
సూపర్-12 లో గ్రూప్ – 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్కు క్వాలిఫై అయ్యాయి. గ్రూప్ – 2 నుంచి ఇండియా, పాకిస్తాన్ సెమీఫైనల్స్ ఆడతాయి. ఈనెల 9న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా న్యూజిలాండ్తో పాకిస్తాన్ తలపడనుంది. ఈనెల 10న భారత్.. అడిలైడ్ ఓవల్ లో ఇంగ్లాండ్తో రెండో సెమీస్ ఆడనుంది.
అదే జరిగితే…
ఈ టోర్నీలో గతనెలలో భారత్-పాకిస్తాన్ మధ్య మెల్బోర్న్ వేదికగా ముగిసిన మ్యాచ్ ఇరు దేశాల అభిమానులను అలరించింది. అయితే మరోసారి ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ చేరే అవకాశముందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంచనాలు వేస్తున్నారు. పాకిస్తాన్ గనక న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్ చేరడం.. అదే విధంగా భారత్ కూడా ఇంగ్లాండ్ పై గెలిస్తే దాయాదులు మళ్లీ ఫైనల్ ఆడటం పక్కా. మరి అలా జరుగుతుందా..? లేదా..? అంటే ఈనెల 10 వరకు వేచి చూడాల్సిందే.
The semi-finals are decided, Time for the knockouts 💪#India #INDvsZIM #T20WorldCup #INDvsENG #Cricket pic.twitter.com/z8rr1onawh
— Wisden India (@WisdenIndia) November 6, 2022