T20 World Cup: కింగ్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్ పుంజుకొని రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే, టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీస్లోనే వెనుదిరగడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇక ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. టీ20 సిరీస్ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది. ఇక తొలి వన్డేలో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది.
కివీస్ బ్యాటర్ టామ్ లాథమ్ అజేయ సెంచరీతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడి తొలి వన్డేలో నెగ్గేందుకు కృషి చేశారు. ఇక ఈ మ్యాచ్లో రాణించిన యువ బ్యాటర్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడెవరో కాదు.. శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్లో ప్రతిభ చూపిన అతడు.. టీ20 స్క్వాడ్లో ఎంపిక కాకపోయినప్పటికీ వన్డేల్లో అదగొడుతున్నాడు. మరో కోహ్లీ దొరికాడంటూ శ్రేయస్ను పోలుస్తూ అభిమానులు శభాష్ అని మెచ్చుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ వన్డేల్లో నెలకొల్పిన రికార్డులు అందరికీ సాధ్యమయ్యేవి కాదు. ఏళ్ల తరబడి ఫామ్లో కొనసాగుతూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. అయితే.. కోహ్లీ ఉండగానే టీమిండియాకు వన్డేల్లో మరో కోహ్లీ లాంటి ఆటగాడు దొరకడం మనకు దక్కిన బోనస్ అంటున్నారు అభిమానులు. కోహ్లీ ఆడినట్లే.. వన్డౌన్లో వచ్చి ఇన్నింగ్స్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడని మెచ్చుకుంటున్నారు.
నిలకడగా ఆడిన అయ్యర్..
నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడని చెబుతున్నారు. టీ20ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నా.. వన్డేల్లో మాత్రం మారో విరాట్ కోహ్లీలా టీమ్కు అండగా ఉంటున్నాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతనే టీమిండియా భవిష్యత్తు కెప్టెన్గా అభివర్ణిస్తున్నారు. ఆక్లాండ్లో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ 76 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. వన్డేల్లో తనదైన శైలిలో ఆడటంపై అయ్యర్ను కోహ్లీతో పోలుస్తూ అభిమానులు మురిసిపోతున్నారు.