T20 World Cup: టీమిండియా సెలెక్టర్లు కొంత కాలంగా కేరళ క్రికెటర్ సంజూ శాంసన్పై శీతకన్ను వేస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్లో అవకాశం దక్కకపోవడంతో శాంసన్తో పాటు అభిమానులు సైతం తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. సెలెక్టర్లపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంజూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కేరళలో జరిగిన మ్యాచ్లో సైతం ఇలాంటి నిరసన వ్యక్తమైంది. మైదానంలోనూ, బయట కూడా సంజూకు మద్దతుగా ఫ్లెక్సీలు, కటౌట్లు సైతం వెలిశాయి. ఈ నేపథ్యంలో తాజాగా న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ తుది జట్టులో సంజూ పేరు కనిపించలేదు. ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతోంది. మొదటి మ్యాచ్లో ఎట్టకేలకు సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కింది.
టీ20ల్లో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య.. సంజూకు అవకాశం ఇవ్వకపోయినా.. వన్డేల్లో తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అవకాశమిచ్చాడు. సంజూను తుది జట్టులోకి తీసుకున్నాడు. దీంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ మైదానంలో తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కివీస్కు భారీ టార్గెట్ ఇచ్చారు.
సంజూపై కాస్త లుక్కేయండి..
కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుత ఆఫ్ సెంచరీ చేశాడు. అతడితోపాటు శుభ్మన్ గిల్ కూడా అర్ధ సెంచరీతో మెరిశాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సైతం బ్యాట్ ఝులిపించాడు. 80 పరుగులతో టీమిండియాను ఆదుకున్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లున్నాయి. మరోవైపు వికెట్ కీపర్ రిషభ్ పంత్ నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత సంజూ శాంసన్ ఎంట్రీ ఇచ్చి కష్ట సమయంలో డీసెంట్ ఇన్నింగ్ ఆడాడు. రాకరాక వచ్చిన చాన్స్ కావడంతో నాలుగు ఫోర్లతో ఆచి తూచి ఆడాడు. 38 బంతులు ఎదుర్కొన్న సంజూ.. 36 పరుగులతో రాణించాడు. టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో పంత్కు వరుస అవకాశాలిచ్చే బదులు కాస్త సంజూపై కూడా లుక్కేయాలని అభిమానులు సెలెక్టర్లకు చురకలంటిస్తున్నారు.