Rayapati Sambasiva Rao: పొత్తుల సంగతి పక్కన పెడితే ఏపీలో సొంతంగా బలపడేందుుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే వీధి గర్జన సభలు నిర్వహించిన బీజేపీ.. పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ క్షేత్రస్ధాయి వరకు పార్టీని బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తోంది. అలాగే ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే టీడీపీ, వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలపై కన్నేసింది. బీజేపీలో చేరాల్సిందిగా వారితో మంతనాలు జరుపుతోంది.
ఈ క్రమంలో ఓ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఎవరో కాదు.. సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావు. గత లోక్ సభ ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుపై ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో ఆయన టీడీపీలో సైలెంట్ గా ఉన్నారు. టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అనారోగ్య కారణాల వల్ల కేవలం కూర్చీకే పరిమితమయ్యారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు.
2014కి ముందు నాలుగుసార్లు గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. 1996,1998,2004,2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమవుతుండగా.. తన కుమారుడు రాయపాటి రంగారావు సత్తెనపల్లి నుంచి పోటీ చేయించేందుకు సిద్దమవుతున్నారు. కానీ చంద్రబాబు కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ కేటాయిస్తామంటూ షరతు పెట్టారు. దీంతో రాయపాటి కుటుంబం నుంచి ఒకరికే టికెట్ దక్కే అవకాశముంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తామని చెప్పడంతో రాయపాటి టీడీపీలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలస్తోంది.
దీంతో బీజేపీలో చేరేందుకు ఆయన సిద్దమవుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నేతలతో ఆయన టచ్ లో ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. రాయపాటితో పాటు ఆయన కుమారుడికి టికెట్ కేటాయించేందుకు బీజపీ అంగీకరించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే రాయపాటి సాంబశివరావు కంపెనీలు, సంస్థలపై పలు కేసులు ఉన్నాయి. అలాగే బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఆయన ఉన్నారు. బీజేపీలో చేరితే ఆ కేసుల నుంచి బయటపడే అవకాశముంది, అందుకే బీజేపీలో చేరేందుకు రాయపాటి సాంబశివరావు రెడీ అయ్యారనే చర్చ జరుగుతోంది. కాగా గతంలో రాయపాటి సాంబశివరావు తమ్ముడు రాయపాటి శ్రీనివాస్ గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, ఎమ్మెల్సీగా పనిచేశారు.