Test Match: బంగ్లాదేశ్ పర్యటనలో మరో సమరానికి టీమిండియా సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన భారత్ ఈనెల 14 నుంచి బంగ్లాదేశ్తో జరిగే రెండు టెస్టుల సిరీస్లో పాల్గొననుంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్లో విజయం ఎంతో ముఖ్యం. పసికూన అని బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేస్తే మరోసారి టీమిండియా కన్ను లొట్టబోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు భారత జట్టులో పలు మార్పులు జరిగాయి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మూడో వన్డే సందర్భంగా గాయపడ్డాడు. దీంతో తొలి టెస్టుకు అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. రోహిత్ ముంబైలో స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లడంతో అతడు తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని.. రెండో టెస్టులో ఆడే విషయంపై బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ దూరం కావడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది.
అయితే పేలవ ఫామ్లో ఉన్న రిషబ్ పంత్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. తొలుత టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను నియమించిన బీసీసీఐ ఇప్పడు తన మనసు మార్చుకుంది. పంత్ స్థానంలో చతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్గా నియమించింది. మరోవైపు గాయాలతో జట్టుకు దూరమైన మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాల స్థానంలో నవ్దీప్ సైనీ, సౌరభ్ కుమార్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. బీసీసీఐ తాజా నిర్ణయంతో పంత్కు రోజులు దగ్గర పడ్డాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడితేనే జట్టులో ఉంటాడని.. లేకుంటే వేటు వేస్తామని బీసీసీఐ పంత్ను పరోక్షంగా హెచ్చరించిందని పలువురు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు టీమిండియా:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), చతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్