Adilabad district: మృత్యువు ఎప్పుడు ఎటునుంచి ముంచుకొస్తుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. అప్పటివరకు మనతో బాగానే ఉన్నవారు మరుక్షణమే చనిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆకస్మిక మరణాలు కుటుంబాలలో తీరని విషాదం నింపుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కొడుకును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కొడుకు కూడా తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తూ ఇటీవలే విద్యుత్ శాఖలో ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. ఇక కొడుకుకు పెళ్లి చేయాలని భావించి ఇటీవల నిశ్చితార్థం కూడా చేశారు.
మరొక వారం రోజుల్లో పెళ్లి ఉండగా ఇంతలోనే ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తకొమ్ముగూడెం గ్రామంలో ఒగేటి సత్తయ్య-లక్ష్మి దంపతులు నివసిస్తుండగా వారికి కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురికి గతంలోనే పెళ్లి చేశారు. ఇక కుమారుడు సాయి అనే 24 ఏళ్ళ యువకుడు బాగా చదువుకుని నిర్మల్ మండలం కొండాపూర్ విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా ఉద్యోగం పొందాడు. గత కొంత కాలం నుంచి ఇక్కడే పని చేస్తున్నాడు. ఇక కొడుకు స్థిరపడడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక యువతితో నిశ్చితార్థం కూడా జరిపించారు. మే 12న పెళ్లి నిర్ణయించారు. ఇక వారం రోజులు సమయం మాత్రమే ఉండడంతో సాయి ఆఫీసుకు సెలవు పెట్టి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు.
పెళ్లి పనుల్లో భాగంగానే తోటి ఉద్యోగులకు స్నేహితులకుఆ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి తన స్నేహితుడితో కలిసి బైక్ పై నిర్మల్ కు వెళ్ళాడు. అక్కడికి చేరుకుని తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి పత్రికలు ఇచ్చాడు. ఇక తిరుగు ప్రయాణంలో భాగంగా దండేపల్లి పరిధిలోని ఒక గ్రామం మీదకు సాయి బైక్ పై వెళ్తున్నాడు. వెనకాల నుంచి హర్వెస్టర్ వీరిని బైక్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ కిందపడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, సాయి అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఇక తీవ్ర గాయాలపాలైన అతడి స్నేహితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక కుమారుడి మరణవార్త తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో వారం రోజుల్లో పెళ్లి అనగా సాయి చనిపోవడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయి మరణంతో రెండు కుటుంబాల్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.