Jagan Chandrababu Naidu: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య స్పష్టమైన తేడాను గుర్తించవచ్చు. ప్రత్యర్థి పార్టీ ఆలోచనలు, పథకాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా తనదైన సొంత ముద్ర వేయాలనేది ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మనస్తత్వం. కానీ చంద్రబాబు మాత్రం పది ఓట్లు వస్తాయనుకుంటే ఎవరినైనా కాపీ కొట్టేందుకు వెనుకాడని నైజం. ఇందుకు తాజా ఉదాహరణగా ఇటీవల విడుదల చేసిన టీడీపీ మొదటి మేనిఫెస్టోను చెప్పుకోవచ్చు. భవిష్యత్కు గ్యారెంటీ పేరుతో టీడీపీ మొదటి విడత మేనిఫెస్టో ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇందులో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, అలాగే ఆడబిడ్డ నిధి, రైతు భరోసా పథకాలు వేరే పేర్లతో చోటు చేసుకోవడం విశేషం. అలాగే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల తీసుకొచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కూడా వుంది. చంద్రబాబు దేశంలోని వివిధ పార్టీల మేనిఫెస్టోలను పరిశీలించి, అందులో జనాకర్షక పథకాలను తీసుకొచ్చి, టీడీపీ మేనిఫెస్టోగా ప్రకటించారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. జగన్ మాత్రం అసలు చంద్రబాబు ఉనికిని గుర్తించడానికి ఇష్టపడరు. అది పాలనైనా, పథకాలైనా కావచ్చు.
చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకాన్ని ఆయన కొనసాగించలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. అలాగే అమరావతి రాజధాని గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏ ఒక్కటీ తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకునేలా ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఎన్నో రోజులు కసరత్తు చేసి నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ను తీర్చిదిద్దారు. వాటిపై విమర్శలు, సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జగన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సంక్షేమ పథకాల పై చంద్రబాబు, లోకేశ్తో పాటు టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రతినిధులు రకరకాలుగా ఘాటుగా విమర్శలు చేశారు.
జగన్ సంక్షేమ పాలన వల్ల ఏపీ శ్రీలంక, వెనుజులా, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ అవుతుందని భారీ విమర్శలు చేశారు. అయితే ఎన్నికల్లో ప్రజాదరణ పొందడానికి చివరికి చంద్రబాబు తన ప్రత్యర్థి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. తీవ్ర విమర్శలు చేసిన నాయకులే, ఏ మాత్రం సిగ్గుపడకుండా తమకు అధికారం ఇస్తే అవే పథకాలు అమలు చేస్తామని హామీలివ్వడం చంద్రబాబుకే చెల్లిందని చేపవచ్చు.