Tollywood: సినిమా ఇండస్ట్రీ అంటే అదొక రంగుల ప్రపంచం. అక్కడ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పుడు ఇమేజ్ ఉంటుందో, ఎప్పుడు ఇమేజ్ ఉండదో అంత తేలిగ్గా చెప్పలేం. కాబట్టి ఇమేజ్ ఉన్నప్పుడే ఆఫర్లున్నప్పుడే జేబులు నింపుకోవాల్సి ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అదే. ఆర్థికంగా స్థిరపడాలంటే అలా చేయాల్సిందే. సంపాదించిన డబ్బును ఆచితూచి ఖర్చు చేయడం ఇక్కడ అలవాటు చేసుకుంటే బాగుపడతారు. లేకుంటే ఆఫర్లు లేని సమయంలో బాధపడక తప్పదు.
కొంత మంది నటీనటులు ఆఫర్లు ఉన్నప్పుడు సంపాదించినా కూడా వాటిని దాచుకోకపోవడం వల్ల ఆ తర్వాత చాలా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ లిస్టులోకి ఇప్పుడు అలనాటి హీరోయిన్ ఐశ్వర్య చేరారు. ఐశ్వర్య తల్లి లక్ష్మి కూడా ఒకప్పటి హీరోయిన్ అయినప్పటికీ తల్లి వారసత్వంతోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చాలా సినిమాల్లో ఐశ్వర్య నటించినా కూడా అంత ఫేమ్ రాలేదు.
శివపుత్రుడు సినిమాతో ఐశ్వర్యకు మంచి నటిగా పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా ఆమెకు సరైన అవకాశాలు లేవు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి తెలిపారు. తనకు నలుగురు పిల్లలు ఉన్నారని, వారిని పోషించడానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. తనకు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఆఫర్లు అంతగా రాలేదని, దానివల్లే ఆర్థికంగా అనేక కష్టాలు అనుభవించానని తెలిపారు. సబ్బులు అమ్మి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించినట్లు ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతకంటే ఎక్కువ డబ్బు వస్తుందంటే తాను పాచి పనులు చేయడానికి, టాయిలెట్లు కడగడానికి కూడా సిద్ధమైనట్లు చెప్పుకొచ్చారు.
సినిమా అనేది తనకు తిండి పెట్టలేదని, సీరియల్స్ ద్వారానే తాను నటిగా గుర్తింపు పొందానని వెల్లడించారు. ప్రస్తుతం చేస్తున్న పనితో తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. తనకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, యోగా చేయడం వల్ల రోజుకు ఒక్క పూట మాత్రం భోజనం చేస్తున్నట్లు ఐశ్వర్య తెలిపారు.