Tollywood: సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫ్యాన్స్ వార్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మా హీరో గొప్పోడంటే మరొకరు మా హీరోనే గొప్ప అని మాటల తూటాలు పేలుస్తుంటారు. హీరోలను ట్రోలింగ్ చేస్తూ.. రణరంగం సృష్టిస్తారు. గతంలో తమిళనాడుకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగు ప్రజలకూ అంటుకుంది. తమ హీరోలను ఎవరైనా ట్రోల్ చేస్తే రెచ్చిపోతుంటారు. అయితే చాలా వరకు తమిళ హీరోల అభిమానులు తెలుగు హీరోలను ట్రోల్ చేయడం జరగదు. చాలా అరుదుగా అలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటి వారే ట్విట్టర్లో మొదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులు.. బాలయ్య బాబు, చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. మీమ్స్ క్రియేట్ చేసి వీడియోలను షేర్ చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం.. సంక్రాంతి రేసులో ‘వారసుడు’ సినిమా ఉండటమే.
ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాతల మండలికి ఊహించని షాక్ ఇచ్చాడు. 2023 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య బాబు నటించిన ‘వీరసింహారెడ్డి’ రేసులో ఉన్నాయి. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు నిర్మాణంలో ‘వారసుడు’ సినిమా కూడా అప్పుడే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే మొదట ఈ సినిమా బై లింగ్యువల్ సినిమాగా చెప్పుకొచ్చారు. కానీ దాని తర్వాత తమిళ రిలీజ్ సినిమా అని, తెలుగులో డబ్బింగ్ చేస్తున్నామని నిర్మాత దిల్రాజు చెప్పుకొచ్చారు.
వారసుడు డబ్బింగ్ సినిమానే అయినా.. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను అడ్డుపడుతోంది. ఈ సినిమా కోసం దిల్రాజు ఆంధ్ర, నైజాంలో ఎక్కువ థియేటర్లు బుక్ చేసుకున్నారు. దీంతో నిర్మాత దిల్రాజుపై మెగాస్టార్, బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. డబ్బింగ్ సినిమా కోసం స్టార్ హీరోల సినిమాలను అడ్డుకుంటావా అని ఫైర్ అవుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వారసుడు సినిమా మార్కెట్ కేవలం రూ.9 కోట్లే. దాని కోసం రూ.60 నుంచి రూ.70 కోట్లు బిజినెస్ చేసే సినిమాలను అడ్డుపడుతున్నట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు.