Tollywood: ఈ ఏడాది తరలిరాని లోకాలకు వెళ్లిపోయిన సినీ తారలు వీళ్లే..

Tollywood: ప్రతి ఏడాది మనందరికీ కొన్ని తీపి, మరికొన్ని చేదు జ్ఞాపకాలను మిగుల్చుతుంది. డిసెంబర్ వస్తే చాలు ఒక్కసారిగా ఈ సంవత్సరం జరిగిన పరిణామాలేంటా అని, వచ్చే ఏడాది చేయాల్సిన పనులేంటా అని అందరూ ఆలోచిస్తుంటారు. అందరి జీవితాల్లో, అన్ని రంగాల్లోలాగే ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ కూడా పలు మైలురాళ్లను అధిగమించింది. అదే విధంగా కొందరు లెజెండ్స్ ను కోల్పోయింది.

 

‘ఆర్ఆర్ఆర్’, ‘మేజర్’, ‘కార్తికేయ 2’ లాంటి సినిమాలతో పాన్ ఇండియా.. ఆ మాటకొస్తే పాన్ వరల్డ్ ఆడియెన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందించింది టాలీవుడ్. ఇక ‘రాధేశ్యామ్’, ‘లైగర్’ వంటి భారీ ఫ్లాపులను రుచి చూసింది. ఇక దిగ్గజ నటులు అనదగ్గ కొందర్ని కోల్పోయింది కూడా. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కొందరు తెలుగు లెజెండ్స్ చనిపోయారు. వారిలో కొందరు వయోధిక కారణాలతో, మరికొందరు కరోనా అనంతర సమస్యలతో తుదిశ్వాస వదిలారు.

 

దాదాపు 75 సినిమాలను తీసిన దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి (88) చెన్నైలో జనవరి 3న కన్నుమూశారు. కృష్ణ హీరోగా అత్యధికంగా 22 చిత్రాలను తీశారాయన. సీనియర్ నటుడు, కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు (56) ఇదే నెల 8వ తేదీన అనారోగ్యంతో తనువు చాలించారు. ఆయన నటించిన చివరి సినిమా ‘ఎన్ కౌంటర్’. పలు తెలుగు చిత్రాల్లో కామెడీ పాత్రలు పోషించిన కొంచాడు శ్రీనివాస్ (47) కూడా మృతి చెందారు. శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో అనారోగ్యంతో ఆయన చనిపోయారు.

 

ప్రముఖ సినీ గీత రచయిత కందికొండ యాదగిరి (49) మార్చి 12వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పలు హిట్ సినిమాలకు ఆయన సాంగ్స్ అందించారు. వెటరన్ డైరెక్టర్ శరత్ (72) ఏప్రిల్ 1న చనిపోయారు. ‘చాదస్తపు మొగుడు’తో దర్శకుడిగా మారిన శరత్.. దాదాపుగా పాతికకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఏషియన్ ఫిలిమ్స్ అధినేత, పంపిణీదారుడు, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ (76) కూడా కన్నుమూశారు.

 

వారి సేవల్ని ఎలా మరువగలం..!
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు (82) సెప్టెంబర్ 11న అనారోగ్యంతో కన్నుమూశారు. అదే నెల 28వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి (70) చనిపోయారు. అక్టోబర్ నెలలో ప్రముఖ నిర్మాతలు మాగుంట సుధాకర్ రెడ్డి, కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున సూపర్ స్టార్ కృష్ణ చనిపోయారు. ఇక డిసెంబర్ 23న సీనియర్ నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ (87) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇలా సినీ పరిశ్రమకు అపురూపమైన సేవలందించిన ఎందరో మహనీయులు ఈ ఏడాది దివికేగి.. ప్రేక్షకులకు ఎనలేని బాధను మిగిల్చారు.

Related Articles

ట్రేండింగ్

Minister Roja: నాడు అప్పులు నేడు కోట్ల రూపాయల ఆస్తులు.. ఆ పనులు చేసి రోజా కోట్లు సంపాదించారా?

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే...
- Advertisement -
- Advertisement -