Mungode: తెలంగాణలో ఎంతో ఖరీదైన ఉప ఎన్నికగా పేరుగాంచిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం నుండి ప్రారంభం కాగా.. ఒక్కో రౌండ్ అన్ని పార్టీలకు ఎంతో కీలకంగా మారింది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు తాము ఊహించిన పోలింగ్ సరళిని సాధించామా లేదా అని బేరీజు వేసుకుంటున్నారు.
మునుగోడు బరిలో ఉన్న ప్రధాన పార్టీల్లో పోటీ మాత్రం అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య కొనసాగుతోంది. మునుగోడు స్థానం సొంతమైన కాంగ్రెస్ మాత్రం ఈ పోటీలో వెనకబడింది. కాగా టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు ఎంతలా గెలుపు కోసం తాపత్రయపడ్డాయో అందరికీ తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరవుతారనే చర్చ సాగుతోంది. సాగా ఈ తరుణంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మునుగోడులో గులాబీ జెండా ఎగరేయాలని గట్టిగా భావిస్తున్న గులాబీ దళానికి ఎదురుగాలి వీచింది. టీఆర్ఎస్ తరఫున మునుగోడు బరిలో నిలిచిన కూసుకుంట్లకు సొంత గ్రామంలోనే షాక్ తగిలింది. దీంతో టీఆర్ఎస్ వర్గాలు కాస్త నిరుత్సాహానికి గురయ్యాయి.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ తరఫున పోటీలో నిలిచిన కూసుకుంట్ల సొంత గ్రామమైన లింగవారిగూడెంలో రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామంలో కూసుకుంట్ల కంటే రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తానికి ఎంతో ఆసక్తిగా సాగుతున్న మునుగోడు కౌంటింగ్ చివరి రౌండ్ వరకు ఇదే ఆసక్తిరేగే అవకాశం కనిపిస్తోంది.