Vaishnavi Chaitanya: ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్సిరీస్తో ఒక్కసారిగా వెండితెరపై వచ్చింది నటి వైష్ణవి చైతన్య. మొదట్లో పలు షార్ట్ ఫిల్మ్ లో నటించిన ఈ భామ.. సోషల్ మీడియాలో మంచి క్రేజే సంపాదించుకుంది. ఆమె ట్యాలెంట్ను గుర్తించిన పలువురు డైరెక్టర్లు.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు ఇచ్చారు. ‘అల వైకుంఠపురంలో, వలిమై’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది వైష్ణవి. ప్రస్తుతం ఈ భామ ఏకంగా సినిమాలో హీరోయిన్గానే అవకాశం దక్కించుకుంది.
హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సాయి రాజేష్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. వైష్ణవి చైతన్యపై పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ..‘బేబీ సినిమాకు హీరోయిన్గా వైష్ణవి చైతన్యను అనుకున్నాను. స్టోరీకి పర్ఫెక్ట్ గా తాను సెట్ అవుతుందని భావించాను. కానీ ఆమెను హీరోయిన్గా తీసుకుంటున్నానని తెలిసి చాలా మంది నాకు కాల్స్, మెసేజ్లు కూడా చేశారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఆమెను చాలా మంది చూశారు. ఆ అమ్మాయిని హీరోయిన్గా ఎందుకు పెడుతున్నావు. ఇంకెవరూ దొరకలేదా? అని అవహేళన చేశారు. కానీ అందరికీ ఒక్కటే చెప్పాను. స్టార్ హీరోలతో కలిసి ఆమె నటించింది. చేసింది చిన్న పాత్రలైనా.. అందులో ఆమె యాక్టింగ్ అందరినీ మెస్మరైజ్ చేసింది. కథ అనుకున్నప్పుడు వైష్ణవి చైతన్య సెట్ అవుతుందని అనుకున్నాను. రేపు సినిమా చూసినప్పుడు మీకే అర్థం అవుతుంది.’ అని పేర్కొన్నారు. కాగా, డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలకు వైష్ణవి కూడా ఎంతో ఎమోషనల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.