Gujarat: వినాయక చవితి వస్తుందంటే చాలు.. అందరు ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వినాయక ఉత్సవాల్లో పాలు పంచుకుంటారు. ప్రతి కాలనీల్లో భారీస్థాయి నుంచి మైక్రో గణనాథులు ప్రతిష్టించి 11 రోజులు పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. మార్కెట్లలో కూడా భిన్నవిభిన్న ఆకతుల్లోని గణపతులను విక్రయిస్తున్నారు. దీంతో ఈ వారం మొత్తం కాలనీలు, బస్తీల్లో వినాయక చవితి శోభ సంతరించుకుంటుంది.
ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచంలోనే అత్యంత విలువైన వినాయకుడు కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్లు విలువ చేసే సహజ సిద్ధమైన వజ్ర గణపతి డైమండ్ సిటీలో కొలువుదీరాడు. అత్యంత విలువైన ఈ గణపతిని భక్తులు దర్శనం చేసుకోవాలంటే మాత్రం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి సుమ.
సూరత్లోని మహీదర్పురాకు చెందిన కరమ్ గ్రూప్ చైర్మన్ వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఈ వజ్ర వినాయకుడిని బెల్జియం నుంచి తీసుకొచ్చారు. 12 సంవత్సరాల క్రితం వజ్రాలను కొనుగోలు చేసేందుకు యాంట్వెర్ప్కు వెళ్లినప్పుడు అక్కడ ఆయన ఈ వజ్రాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వినాయకుడికి కనుభాయ్ ఇంట్లోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది వినాయక చవితికి మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
ఈ విఘ్నేశ్వరుడు స్వయంగా వజ్రాల రూపంలో మనపై కురిపించిన అమూల్యమైన ఆశీర్వాదం అని.. అందుకే ఈ వజ్రాన్ని తాను అమ్మకానికి పెట్టడం లేదని కనుభాయ్ పేర్కొంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క సహజ వజ్రం వినాయకుడు ఇదే. ఈ విగ్రహాన్ని వినాయక చవితి అనంతరం అత్యంత సురక్షితమైన, రహస్య ప్రదేశంలో ఉంచుతున్నట్లు కనుభాయ్ తెలిపారు. ప్రతి ఏడాది వినాయ చవితి రోజు ఈ వజ్ర వినాయకుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. ఈ వజ్ర గణపయ్య గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.