క్రికెట్‌లో సంక్షోభం.. రిటైర్మెంట్ యోచనలో క్రికెటర్లు.. కారణమిదే..

ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌తో సహా అనేక ప్రైవేటు క్రికెట్ లీగ్‌లు రావడంతో క్రికెట్ స్వరూపమే మారిపోతోంది. టెస్టులు, వన్డేలకు ప్రాధాన్యత తగ్గుతోంది. 

టీ20లు, టీ20 లీగ్‌లు హవా చాటుతున్నాయి. ఆయా ఫ్రాంఛైజీలు ఆటగాళ్లకు కోట్ల రూపాయలు ఇవ్వడానికి వెనుకాడటం లేదు.

ఈ క్రమంలో అంతర్జాతీయంగా భారీ మార్పులు రాబోతున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (FICA) సర్వేలో వెల్లడైంది.

దేశ కాంట్రాక్టుల తిరస్కరణ లీగ్‌లలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌ను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తేలింది. 

FICA నివేదిక ప్రకారం, దేశీయ లీగ్‌లలో ఆడుతూ ఎక్కువ డబ్బును పొందుతున్నవారిలో 49 శాతం మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌ను విడిచిపెట్టవచ్చని తెలుస్తోంది. 

దీనికి బలంచేకూరుస్తూ చాలా మంది క్రికెటర్లు తమ దేశ కాంట్రాక్టులను తిరస్కరిస్తున్న విషయం తెలిసిందే.

క్రికెటర్లు ఎక్కువగా లీగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడంవల్ల వెస్టిండీస్ అత్యధికంగా నష్టపోయింది. స్టార్ క్రికెటర్లు దేశీయంగా కొద్దిగా పేరు సంపాదించుకోగానే యుక్తవయసులోనే రిటైర్మెంట్ ప్రకటించి, విదేశీ లీగ్‌లకు మొగ్గు చూపుతున్నారు. 

సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, క్రిస్ గేల్, డ్వైన్ బ్రావో లాంటి ఆటగాళ్లు ఇందుకు ఉదాహరణ. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తప్ప మరే ఇతర టీ20 లీగ్‌లో భారత క్రికెటర్లు ఆడలేరు. ఈమేరకు బీసీసీఐ నిబంధనలు విధించింది.

ఒకవేళ ఏదైనా విదేశీ లీగ్ ఆడాలనుకుంటే.. పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. మన దేశం తరఫున ఆడితే వచ్చే క్రేజ్, డబ్బు వల్ల క్రికెటర్లు ఇతర లీగ్‌ల వైపు మొగ్గు చూపరు. 

అలాగే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల క్రికెటర్లు కూడా తమ దేశ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తారు.