అత్యంత సంపన్న బోర్డు ఆదాయం అంటే అట్లుంటది మరి.. తిరుగులేని శక్తిగా బీసీసీఐ

ప్రపంచ క్రికెట్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు ప్రత్యేకమైన స్థానం ఉంది.

ప్రపంచ క్రికెట్ ను నియంత్రించే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని సైతం కనుసైగతో శాసించే బీసీసీఐని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పిలుస్తారు. 

ఐపీఎల్ పుణ్యమా అని బీసీసీఐ ఆదాయం ప్రతీ ఏటా కోటానుకోట్లు పెరుగుతూనే ఉన్నది. ఈ ఏడాది ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా రూ. 48వేల కోట్లు ఆర్జించిన బీసీసీఐ..

 తాజాగా ప్రపంచ క్రికెట్ లో తనను బీట్ చేసే బోర్డు మరొకటి లేదని మరోసారి నిరూపించుకుంది.

2021 సంవత్సరానికి గాను అత్యధిక ఆదాయం పొందిన క్రికెట్ బోర్డులలో బీసీసీఐదే అగ్రస్థానం. గతేడాది బీసీసీఐ ఏకంగా రూ. 3,730 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 

క్రిక్ ట్రాకర్ లో వచ్చిన కథనం మేరకు.. 2021కి గాను బీసీసీఐ రూ. 3,730 కోట్ల ఆదాయాన్ని పొందింది. 

భారత్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) రూ. 2,843 కోట్ల ఇన్‌కమ్ సాధించింది. సీఏ కంటే భారత్ ఆదాయం 23 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ జాబితాలో ఇంగ్లాండ్ (రూ. 2,135 కోట్లు) మూడో స్థానంలో ఉంది. ఇక చీటికి మాటికి బీసీసీఐ, టీమిండియా మీద పడి ఏడ్చే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదాయం మన దాంట్లో మూడో వంతు కూడా లేదు.

పీసీబీ ఆదాయం రూ. 811 కోట్లు మాత్రమే. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆదాయం రూ. 802 కోట్లు కాగా సౌతాఫ్రికా (రూ. 485 కోట్లు), న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (రూ. 210 కోట్లు), వెస్టిండీస్ (రూ. 116 కోట్లు), జింబాబ్వే (రూ. 113 కోట్లు)గా ఉంది. 

అన్నింటికంటే తక్కువగా శ్రీలంక క్రికెట్ రూ. 100 కోట్లుగా ఉంది.