Siddipet: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యల కేసులు కలకలం రేపుతున్నాయి. అనేక కారణాల వల్ల ఊహించని విధంగా చాలామంది ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని ప్రదేశాలలో అయితే కుటుంబాలు మొత్తం ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నాయి. తాజాగా కూడా హైదరాబాదులో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. భార్యాభర్త అలాగే ఇద్దరు పిల్లలు కుటుంబం మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కుషాయిగూడ లోని కందిగూడలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
నిజామాబాద్కు చెందిన గాదె సతీశ్ అనే 39 ఏళ్ళ వ్యక్తికు, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందిన వేద అనే 25 ఏళ్ళ మహిళతో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పెద్ద అబ్బాయి నిషికేత్ వయసు 9 ఏళ్ళు కాగా రెండో అబ్బాయి నిహాల్ వయసు 5 సంవత్సరాలు. ఈ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. సతీష్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. రెండేళ్లుగా కుటుంబంతో కందిగూడలో నివాసముంటున్నారు. నిహాల్ పుట్టుకతోనే ఆటిజంతో బాధపడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం నిషికేత్ కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులకు చూపించగా మెనింజైటిస్ ఉన్నట్లు చెప్పారు.
నిషికేత్కు చెవుల నుంచి తరచూ చీము రావడంతో పాటు వినికిడి లోపం ఏర్పడింది. అప్పటినుంచి దంపతులిద్దరూ పిల్లల ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉండేవారు. దాంతో కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా శనివారం పిల్లలకు, భార్యకు సతీశ్ సైనైడ్ ఇచ్చాడు. ఇక ముగ్గురూ చనిపోయారని ధ్రువీకరించుకున్న తర్వాత తానూ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే మధ్యాహ్నం సతీశ్, వేదలకు తెలిసిన వ్యక్తులు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ లిప్ చేయక పోయే సరికి అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా ఇద్దరు పిల్లలు, వేద పడక గదిలోని మంచంపై విగతజీవులుగా పడిఉన్నారు.
సతీశ్ పక్క గదిలో కుప్పకూలిపోయి కనిపించాడు. ఇక వెంటనే తెలిసిన వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సతీష్ కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రి కీ తరలించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక లెటర్ కూడా ఉంది. మా నలుగుర్ని కాపాడాలని ప్రయత్నించొద్దు. ప్రశాంతంగా చనిపోనివ్వండి అని అందులో రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారికీ సైనైడ్ ఎలా లభించింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.