Chandrababu: ఏపీలో వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటికే అందుకు సంబంధించిన వేడి మొదలయ్యింది. ఒకవైపు టిడిపి మరోవైపు జనసేన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేసాయి. మరోవైపు జగన్ మరో జనం తనని గెలిపిస్తారు అన్న ధీమాతో ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం టిడిపి మెడపై ఎన్ఆర్ఐ కత్తి వేలాడుతోంది. టీడీపీ టికెట్ ఆశిస్తున్న నేతల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా చంద్రబాబు వెనుకాడడం లేదు. ముఖ్యంగా టీడీపీ నేతలు తమ నియోజకవర్గాల్లో చురుగ్గా పాల్గొనకపోవడంతో, టికెట్ ఇవ్వనని హెచ్చరించే క్రమంలో ఎన్ఆర్ఐ సాకుతో బాబు బెదిరిస్తున్నారనే చర్చలు ఇప్పటికే టీడీపీలో వినిపిస్తున్నాయి.
వైసీపీని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలంగా వుండాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. దాంతో బాబు ప్రస్తుతం బాగా డబ్బు ఉన్న నేతల కోసం వెతుకుతున్నారట. ఈ క్రమంలో గుడివాడలో కొడాలి నానీని ఢీకొట్టడానికి వెనిగండ్ల రాము అనే ఎన్ఆర్ఐ దొరికాడు. రామునీ చూపిస్తూ మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అటువంటి వాళ్లనే తీసుకొస్తానంటూ సొంత పార్టీ నేతల్ని కూడా బెదిరిస్తున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. గుడివాడ టికెట్ను రావి వెంకటేశ్వరరావు ఆశిస్తున్నారు. నియోజకవర్గాన్ని విడిచి పెట్టకుండా ఆయన పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నాఫలంగా అమెరికా నుంచి రాము దిగిపడ్డారు. కేవలం ఆర్థక వనరుల్ని చూసి రాముకు తాజాగా గుడివాడ టికెట్ను ఖాయం చేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రామును అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. గుడివాడ టికెట్ను ఆశిస్తున్న రావి వెంకటేశ్వరరావును పిలిచి.. కొడాలిపై గెలవాలంటే కనీసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టాలి. నువ్వు అంత ఖర్చు భరిస్తానంటే టికెట్ ఇస్తాను. లేదంటే ప్రత్యామ్నాయం చూసుకుంటా అని తేల్చి చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రూ. 100 కోట్లు ఖర్చు పెట్టుకోలేనని, మరొకరికి చూసుకోవాలని రావి వెంకటేశ్వరరావుతోనే చెప్పించారు బాబు. ఒక్క గుడివాడలో మాత్రమే కాకుండా ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ రూ.50 కోట్లకు పైబడి ఖర్చు పెట్టుకోవాల్సిందే అని, లేదంటే ఎన్ఆర్ఐలను తీసుకొస్తానని చంద్రబాబు పరోక్షంగా బెదిరిస్తున్నారనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి తప్పక వస్తుందనే కలరింగ్ ఇస్తుండడంతో కొన్ని చోట్ల ఎన్ఆర్ఐలు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. విదేశాలకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్న వాళ్లకు రూ.50 కోట్లు, రూ.100 కోట్లు లెక్కే కాదు. దీన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు ఎత్తుగడ వేశారు.