YCP Leaders: వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నానికి కాపులసెగ పట్టుకుంది. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తున్న నానికి ఇక్కడ 32 శాతంగా ఉన్న కాపుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు వారి నుంచే సెగ పెరుగుతుండడంతో నాని తర్జన భర్జన పడుతున్నారు. తాజాగా కాపులు కొడాలి పై విరుచుకుపడ్డారు. కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన గుడివాడ ఎమ్మెల్యే నానీని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్ చేస్తున్నాయి.
కాపులను కులం పేరుతో దూషించడాన్ని ఐక్య కాపునాడు, కాపువర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కులం పేరుతో బూతులు తిట్టడాన్ని అన్ని వర్గాలు గమనిస్తున్నాయని తెలిపారు. రంగా విగ్రహాలకు దండలు వేసి, రంగా కుమారుడితో మాట్లాడితే సరిపోదని, సాటివారిని గౌరవించడం తెలుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా నానీని వైసీపీ కాపు నాయకులు ప్రశ్నించడంతోపాటుగా కాపుసమాజానికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ కూడా చేశారు. దాంతో నానిపై పోలీసులు సుమోటోగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.
కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కాపు జాతిని అవహేళన చేయడం ఆంధ్రరాష్ట్రానికే అవమానమని తెలిపారు.
కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొడాలి నాని గుడివాడలో గెలిచిందే కాపు ఓట్లతోనేనని, రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ హెచ్చరించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. అయితే ఈ వివాదంపై కూడా నాని అని ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.