Women Cricket: దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 26వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును బుధవారం ఆలిండియా మహిళల సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. టీమిండియాలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 25 ఏళ్ల అంజలి శర్వాణికి చోటు దక్కింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఈ జట్టుకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది.
పేస్ బౌలర్ అంజలి శర్వాణి ఇటీవల ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్లో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు సెలక్టర్లు ప్రపంచకప్ జట్టులో స్థానం కల్పించారు. ఆసీస్తో సిరీస్లో విఫలమైన జెమీమా టీమ్లో చోటు నిలబెట్టుకుంది. పేసర్ల కోటాలో రేణుకా ఠాకూర్, పుజా వస్త్రాకర్ ఎంపికయ్యారు. కానీ పూజా వస్త్రాకర్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బోర్డు ప్రకటించింది. స్పిన్ కేటగిరిలో ఆల్రౌండర్లు దీప్తి శర్మ, దేవికా వైద్యతో పాటు రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ ఎంపికయ్యారు.
అయితే ప్రపంచకప్ జట్టులో మరో తెలుగమ్మాయి కూడా ఉంది. సబ్బినేని మేఘనను సెలక్టర్లు రిజర్వు ప్లేయర్గా ఎంపిక చేశారు. ఆమెతో పాటు స్నేహ్ రాణా, మేఘనా సింగ్లను కూడా రిజర్వు ప్లేయర్లుగా తీసుకున్నారు. ప్రపంచకప్ కంటే ముందు జనవరి 19 నుంచి సౌతాఫ్రికాలో ఆతిథ్య జట్టు, వెస్టిండీస్లతో కలిసి భారత జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ కోసం కూడా సెలక్టర్లు జట్టును ప్రకటించారు.
ప్రపంచకప్లో మళ్లీ పాకిస్థాన్తోనే తొలి మ్యాచ్
ఇటీవల ఏ మెగా టోర్నీని తీసుకున్నా టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది దేశం పాకిస్థాన్తోనే ఆడాల్సి వస్తోంది. పురుషుల ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ మాదిరిగానే మహిళల టీ20 ప్రపంచకప్లో కూడా భారత్ తొలి మ్యాచ్లో పాకిస్థాన్తోనే తలపడనుంది. గ్రూప్-2లో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 12న కేప్టౌన్లో పాకిస్థాన్తో ఆడుతుంది. 15,18, 20 తేదీల్లో వరుసగా వెస్టిండీస్, ఇంగ్లండ్, ఐర్లాండ్తో తలపడనుంది.