Womens IPL: భారత్లో క్రికెట్ అనగానే ఎవరికైనా ఇప్పుడు ఐపీఎల్ మాత్రమే గుర్తుకువస్తోంది. అంతలా మన దేశంలో ఐపీఎల్ ఆదరణ పొందింది. ఇంటర్నేషనల్ మ్యాచ్లను కూడా పక్కనబెట్టి ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది నుంచి పురుషుల ఐపీఎల్తో పాటు మహిళల ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంకా జట్లను ఖరారు చేయలేదు. కానీ ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే మహిళల ఐపీఎల్ జాక్పాట్ కొట్టింది.
2023 నుంచి 2027 వరకు మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను రిలయన్స్ సంస్థకు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ. 951 కోట్లను బీసీసీఐకి చెల్లించనుంది. ఒక్కో మ్యాచ్ కోసం రూ.7.09 కోట్లను వయకామ్ 18 చెల్లించనుందని భారత క్రికెట్ బోర్డు పేర్కొంది. సోమవారం జరిగిన వేలంలో హాట్ స్టార్, సోనీ లాంటి బడా సంస్థలను వెనక్కి నెట్టి మరీ వయాకామ్ 18 ఈ డీల్ను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ మహిళల తొలి సీజన్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ముంబైలో జరిగే ఈ లీగ్లో ఐదు జట్లు బరిలోకి దిగుతాయి. గతేడాది జూన్లో జరిగిన వేలంలో పురుషుల ఐపీఎల్కు సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను ఐదేళ్ల కాలానికి రూ.23,758 కోట్లు చెల్లించి వయాకామ్ 18 దక్కించుకుంది. స్టార్ సంస్థ రూ.23,575 కోట్లకు టీవీ హక్కులను సొంతం చేసుకుంది.
మహిళల ఐపీఎల్ మొత్తం హక్కులు ఒక్కరికే
పురుషుల ఐపీఎల్ డిజిటల్, టీవీ, గ్లోబల్ హక్కులు వేర్వేరు సంస్థలు దక్కించుకోగా మహిళల ఐపీఎల్ డిజిటల్, టీవీ, గ్లోబల్ ప్రసార హక్కులను మాత్రం ఒక్క వయాకామ్ 18నే సొంతం చేసుకుంది. అయితే పురుషుల మీడియా రైట్స్ తో పోలిస్తే మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్ తక్కువ ధరే పలికింది. అయినప్పటికీ తొలిసారే ఈ మొత్తాన్ని సాధించిందంటే గ్రేట్ అనే చెప్పాలి.