Food: మనం రోజూ ఆహారం తీసుకుంటూ ఉంటాం. జీవనశైలి సక్రమంగా కొనసాగాలంటే క్రమం తప్పకుండా మంచి పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. రోజులో మూడు పూటల తినే ఆచారం మనకు పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం తిని రోజును ముగిస్తూ ఉంటారు చాలా మంది. అయితే, ఫుడ్ తీసుకోవడానికి సరైన సమయం, మార్గం, ఎన్నిసార్లు తీసుకోవాలనే ప్రశ్నలుచాలా మందిని వేధిస్తూ ఉంటాయి.
రోజుకు మూడు పూటల మాత్రమే ఫుడ్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. తద్వారా ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి దోహదపడుతుందని అంటుంటారు. కొందరు తక్కువ మొత్తంలో రోజుకు 4-5 సార్లు తినడాన్ని లైక్ చేస్తుంటారు. తక్కువ వ్యవధిలో రోజుకు 5 – 6 సార్లు తింటే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుందట.
మానవ శరీరానికి ప్రతి రెండు మూడు గంటలకు కాస్త ఫుడ్ అవసరం అవుతుందట. ఈ నేపథ్యంలో మధ్యమధ్యలో తినడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి తినడానికి బదులుగా చిన్నచిన్నగా విడగొట్టుకొని భోజనం తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందట. ఇది కొవ్వును వేగంగా కరిగించడమే కాకుండా జీవశక్తిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు
రోజుకు 12 గంటలు తీసుకుంటే అనర్థాలు
భాగాలుగా విడగొట్టి తీసుకోవాలన్నారు కదా అని.. రోజుకు 12 గంటల పాటు ఆహారం తీసుకోరాదు. అయితే, ఉపవాసం చేయడం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసంతో గ్లైసెమిక్ ప్రక్రియ మెరుగవుతుంది. మరోవైపు ఒక పూట భోజనం చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందట.