Crypto: క్రిప్టో కరెన్సీ.. కొంత కాలం కిందట వరకు కొందరిని లక్షాధికారులను చేసింది. దీని ద్వారా ఇన్వెస్ట్ మెంట్ చేసిన వారి పంట పండింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ట్యాక్స్ కూడా వేసింది. కనిపించని కరెన్సీపై ట్యాక్యులేంటంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే, కరోనా సమయంలో క్రిప్టో కరెన్సీ అంతరించే పరిస్థితికి చేరింది. ఇన్వెస్టర్లు బిచ్చగాళ్లయ్యారు. పెట్టిన పెట్టుబడి అంతా జీరోకు చేరిపోయింది.
ఇన్వెస్టర్ల సంగతి అటుంచితే.. క్రిప్టో సంస్థ కూడా దివాలా తీసింది. సుమారు 1.36 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. క్రిప్టో సంస్థ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడైన బ్యాంక్మన్ ఫ్రైడ్ సంపద అంతా అంతరించింది. 30 ఏళ్లకే బిలియనీర్గా మారిన అతగాడి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిపోయింది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలైన తీరుగా అతడి జీవితం తల్లకిందులైపోయింది.
వారం రోజుల్లో హాం ఫట్..
క్రిప్టో సంస్థ ఎఫ్టీఎక్స్ సహవ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ సంపద వారం రోజుల కిందట 1,600 కోట్ల డాలర్లు ఉండేది. ప్రస్తుతం ఇది సున్నాగా మారిపోయింది. ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.లక్షా 36 వేల కోట్లు అవుతుంది. ఇదంతా అచ్చంగా వారం రోజుల్లో కరిగిపోయింది. అతడి క్రిప్టో అడ్డా కూలిపోవడమే ఇందుకు కారణం. గరిష్ఠంగా అతడి ఆస్థి ఒకప్పుడు 2,600 కోట్ల డాలర్లను తాకింది.
ఈ వారం ప్రారంభంలో 1,600 కోట్ల డాలర్లుగా ఉండగా, సీఈవో పదవికి రాజీనామా చేయడం, కంపెనీ దివాళాకు పెట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అతడి అమెరికా ఆస్తుల విలువ కేవలం 1 డాలరుగా పేర్కొని ఈ మేరకు అంచనా వేసింది. తాజాగా అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్.. శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్పై దర్యాప్తు జరుపుతోంది.