Online Game: ప్రస్తుతం టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందింది. స్మార్ట్ ఫోన్ల వాడకం భారీగా పెరిగిన తర్వాత.. ఆన్లైన్ మోసగాళ్ల దాడులు భారీగా పెరిగాయి. కొత్త కాన్సెప్టులతో జనాలను లూటీ చేస్తున్నారు. ఇటీవలకాలంలో ఆన్లైన్ గేమ్స్ బాగా పాపులర్ అయ్యారు. ఇప్పటికే ఆన్లైన్ గేమ్స్ లో డబ్బులు కోల్పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. రూ.లక్షల్లో డబ్బులు కోల్పోయి.. చివరకు సూసైడ్ చేసుకున్న వాళ్లూ ఉన్నారు. అలాగే ఆటకు బానిసైన యువకులు అప్పుడప్పుడు తారసపడుతుంటారు.
తాజాగా అలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ డిగ్రీ విద్యార్థి చేసిన పనికి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు భూనిర్వాసితుడు కావడంతో కొన్నేళ్ల క్రితం అతడికి రూ.95 లక్షల పరిహారం వచ్చింది. దీంతో ఆ రైతు డబ్బు మొత్తాన్ని బ్యాంకులో జమ చేసుకున్నాడు. అతడికి డిగ్రీ చదువుతున్న కొడుకు ఉన్నాడు. ఆన్లైన్ గేమింగ్ మీద ఉన్న మోజుతో ‘గేమ్ కింగ్’ అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ గేమ్కు బానిసైన ఆ యువకుడు.. ఆ గేమ్ ఆడుతూ తన తండ్రి ఖాతాలో ఉన్న రూ.95 లక్షలు పోగొట్టాడు. దీంతో ఈ విషయం తెలిసిన ఆ రైతు లబోదిబోమంటున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకున్నాయి. సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. బ్యాకింగ్కు సంబంధించిన వివరాలను ఎవరికీ వెల్లడించవచ్చని హెచ్చరిస్తున్నారు. కానీ కొందరు వ్యక్తులు తెలిసి కూడా అదే తప్పులు చేస్తున్నారు. ఆశను చూపి.. రూ.లక్షల్లో డబ్బులు కొల్లగొడుతున్నారని పోలీసులు తెలిపారు. సైబర్ నేరాలతో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.