WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆదిలోనే షాకులు తాకుతున్నాయి. ఏరికోరి ఎంపిక చేసుకున్న ఆ జట్టు సారథి, ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఆడకుండానే సీజన్ నుంచి తప్పుకుంది. గత శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడ్డ ఆమె తర్వాత కోలుకుని తిరిగి జట్టుతో కలుస్తుందని ఆశించినా గుజరాత్ అభిమానులకు నిరాశే ఎదురైంది.
ముంబై ఇండియన్స్తో మ్యాచ్ లో గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తొలి ఓవర్ నాలుగో బంతికే పరుగు తీసే యత్నంలో మూనీ కాలు బెనికింది. దీంతో ఆమె ఇద్దరు వ్యక్తుల సాయంతో డ్రెస్సింగ్ రూమ్ చేరింది. ఆ మ్యాచ్ లో చివరి వరకైనా మూనీ బ్యాటింగ్ కు వస్తుందని అభిమానులు ఆశించినా నొప్పి తగ్గకపోవడంతో ఆమె బెంచ్కే పరిమితమైంది.
ఇక ఆ తర్వాత యూపీ, బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లలో కూడా మూనీ ఆడలేదు. ఆమె స్థానంలో టీమిండియా ప్లేయర్ స్నేహ్ రాణా జట్టును నడిపించింది. గాయం ఇంకా తగ్గకపోవడంతో మూనీ తర్వాతి మ్యాచ్ లకు అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉండటంతో గుజరాత్ ఆమెకు విశ్రాంతినిచ్చింది. వేలంలో మూనీని రూ. 2 కోట్లకు దక్కించుకున్న గుజరాత్.. ఆమెను సారథిగా నియమించినా వారికి నిరాశే మిగిలింది.
మూనీ స్థానంలో దక్షిణాఫ్రికా ఓపెనర్, ఇటీవలే మహిళల టీ20 ప్రపంచకప్ లో నిలకడగా రాణించిన లారా వోల్వార్డ్ట్ ను తీసుకుంది. కాగా ఫిబ్రవరి 13న జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో లారా పేరిచ్చినా ఏ ఫ్రాంచైజీ కూడా ఆమెను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. మూనీ స్థానంలోనే వోల్వార్డ్డ్ ఓపెనింగ్ ఆడనుందని సమాచారం.
కాగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ తో మ్యాచ్ లను ఓడిన గుజరాత్ జెయింట్స్.. బుధవారం బ్రబోర్న్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముగిసిన మ్యాచ్ లో మాత్రం 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 20 ఓవర్లలో 190 పరుగులకే పరిమితమైంది.