Anantha Vishnu Deva: ఏంటి 300 రూపాయలకు 200 గజాల స్థలమా! ఆశ్చర్యపోతున్నారా.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం రూ.300 కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. 200 గజాల భూమి, రూ.లక్ష లోన్ ఇస్తామంటూ రవీంద్రభారతి పక్కనే ఉన్న మౌంట్ నసీర్ అపార్ట్మెంట్లోని జై మహాభారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది భగవాన్ శ్రీఅనంత విష్ణు తమను నమ్మించారంటూ వందల సంఖ్యలో వచ్చిన మహిళలు తరలివచ్చి ఆందోళనకు దిగారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
భూమి ఇవ్వాలంటూ మహిళలు అనంత విష్ణును నిలదీశారు. ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా కొందరు మహిళలు నిలదీయగా మరో మహిళ వారించే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడున్న మహిళలు ఆమెపై దాడికి దిగారు. ఇతర జిల్లాల నుంచి కూడా మహిళలు రావడం గమనార్హం. గతంలో సైఫాబాద్ పోలీసులు అనంత విష్ణుపై కేసు నమోదు చేశారు. తాను సుప్రీంకోర్టు న్యాయవాదినని చెప్పేవాడు.
అయితే ఇప్పటికి లక్షల మంది నుంచి రూ.300 చొప్పున వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అనంత విష్ణును ప్రశ్నించగా తమ ట్రస్టుకు సంబంధించి వేలాది ఎకరాల భూములుఉన్నాయని, పేదలకు పంచిపెడతామంటూ ప్రకటించడం గమనార్హం. ఈ సమావేశం ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించాలనుకున్నామని, డీసీపీ అనుమతించ లేదని, కోర్టుకు వెళతామని అన్నారు.