Kushmanda Deeparadhana: కూష్మాండ దీపారాధన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు పెరిగిపోయినప్పుడు, పిల్లలు మన మాట విననప్పుడు, దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు చుట్టిన ముట్టినప్పుడు కాలభైరవ తత్వం ప్రకారం మంచి పరిహారం. ఈ పూజ అందరూ చేసుకోవచ్చు. అయితే ఈ దీపం గుడిలో పెట్టకూడదు, ఇంట్లో మాత్రమే పెట్టుకోవాలి. ముందు ఈ దీపాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం.
ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని దానిని అడ్డగా కోసి అందులో గుజ్జు, పిక్కలు తీసేసి డొల్ల లాగా చేయాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండువేసి దీపం వెలిగించాలి. ఈ గుమ్మడికాయ కింద ఇత్తడి పళ్ళెం పెట్టాలి. ఎవరైతే సంకల్పం చేసుకుంటున్నారో వారు మాత్రమే ఈ పనులన్నీ చేసుకోవాలి. ఈ దీపానికి పంచ ఉపచార పూజ చేసి దీపం దగ్గర కాలభైరవాష్టకం 11 సార్లు చేయాలి.
అలాగే ఈ పూజని బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున గాని చేయాలి. ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి. జనాకర్షణ కోసం అమావాస్య రోజున చేయాలి. 19 అష్టములు కానీ 19 అమావాస్యలు కానీ చేయాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం పెట్టాలి. ఆరోజు ఉపవాసం ఉండి ఘనపదార్థం తినకుండా ద్రవపదార్థం మాత్రమే తీసుకోవాలి. ఉదయం 4:30 నుండి 6 గంటల మధ్యలో చేయాలి.
దేవుడిని ప్రార్థించుకొని సంకల్పం చెప్పుకొని మనసులోనే కోరిక చెప్పుకోవాలి. చండీ హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ కూష్మాండ దీపారాధన చేస్తే అంత ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ దీపం వెలిగించడం వల్ల మీ జీవితంలో ఉన్న పూర్తి దృష్టి, గ్రహ, వాస్తు పీడలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. ఈ దీపారాధన అత్యంత శక్తివంతమైనది. విపరీతమైన జనాకర్షణ పెరగడానికి ఈ దీపం ఎంతో శ్రేష్టమైనది.