NABARD Grade A Notification 2023: తాజాగా కేంద్రానికి చెందిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన విడుదల అయింది. వీటికి డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా నాబార్డ్ కృషి చేస్తోంది. ఇందుకోసం సమర్థులైన మేనేజర్లతోపాటు, సబ్జెక్టు నిపుణులు అవసరం. జనరల్ విభాగంలో 77 పోస్టులకు సాధారణ డిగ్రీతోనే పోటీ పడవచ్చు. రూరల్ డెవలప్మెంట్ కోర్సులు చదువుకున్నవారు ఈ పరీక్షలో రాణించడానికి అవకాశం ఉంది. ఆంగ్లంలోనూ ప్రావీణ్యం అవసరం. పరీక్షకు సంబంధించి సిలబస్ వివరాలు నోటిఫికేషన్లో వెల్లడించారు. వాటిని గ్రాడ్యుయేషన్ స్థాయిలో శ్రద్ధగా చదివితే రాణించగలరు. ఈ ఉద్యోగంలో చేరినవారు అధిక వేతనంతో పాటు వృత్తిపరమైన సంతృప్తినీ పొందవచ్చు. వీరికి రూ.44,500 మూల వేతనం చెల్లిస్తారు. అన్ని అలవెన్సులతో నెలకు రూ.లక్ష జీతం పొందవచ్చు. దీంతో పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. పట్టణాలు, నగరాల్లోనే విధులు నిర్వర్తించవచ్చు. ఇకపోతే ఎంపిక విషయానికి వస్తే.. ఫేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్-2 మెయిన్ పరీక్షలు, ఫేజ్-3 మౌఖిక పరీక్షతో నియామకాలు ఉంటాయి.
ఫేజ్-1 ప్రిలిమినరీ… ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. అన్ని కూడా ఆబ్జెక్టివ్ ప్రశ్నలే వస్తాయి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థులందరికీ ప్రిలిమినరీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 20, రీజనింగ్ 20, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30, కంప్యూటర్ నాలెడ్జ్ 20, డెసిషన్ మేకింగ్ 10, జనరల్ అవేర్నెస్ 20, గ్రామీణ భారతదేశం లక్ష్యంగా ఆర్థిక, సాంఘిక అంశాల్లో 40, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. సెక్షన్లవారీ కటాఫ్ ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డెసిషన్ మేకింగ్ విభాగాల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. జనరల్ అవేర్నెస్, ఆర్థిక సాంఘిక అంశాలు, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి విభాగాల్లో అర్హత మార్కులు పొందిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్ ప్రకారం ఫేజ్-2కి అవకాశమిస్తారు. ఫేజ్-1లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఒక్కో పోస్టుకు 25 మందికి చొప్పున ఫేజ్-2కు ఎంపిక చేస్తారు.
ఫేజ్-2 మెయిన్…ఈ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండు విధాల్లోనూ ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ నుంచి డిస్క్రిప్టివ్ విధానంలో ఆన్లైన్లోనే కీబోర్డు ఉపయోగించి సమాధానాలు రాయాలి. మొత్తం మార్కులు వంద. పరీక్ష వ్యవధి ఒకటిన్నర గంటలు. అభ్యర్థికి ఆంగ్లంలో రాత, విశ్లేషణ నైపుణ్యాలు పరిశీలిస్తారు. దీనికోసం ఎస్సే, కాంప్రహెన్షన్, రిపోర్ట్, పారాగ్రాఫ్, లెటర్ రైటింగ్ల్లో ప్రశ్నలడుగుతారు. పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. పేపర్-2 ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండు విధాలుగానూ ఉంటుంది. జనరల్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గ్రామీణ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక, సాంఘిక అంశాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ప్రశ్నలు వస్తాయి. పరీక్షకు వంద మార్కులు. ఇందులో 30 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 50 మార్కులు. కొన్ని ఒక మార్కు, మరికొన్ని రెండు మార్కుల ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 30 నిమిషాలు. డిస్క్రిప్టివ్లో 6 ప్రశ్నలు వస్తాయి. వీటికి 50 మార్కులు. వ్యవధి 90 నిమిషాలు. నాలుగు ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది. కీబోర్డు ఉపయోగించి, ఇంగ్లిష్ లేదా హిందీలో రాయాలి. రెండు ప్రశ్నలకు ఒక్కో దానికి 15 చొప్పున 30 మార్కులు. మరో రెండు ప్రశ్నలకు ఒక్కో దానికి 10 చొప్పున 20 మార్కులు. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధిత విభాగంలో పేపర్-2 ప్రశ్నపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానికీ పావు శాతం మార్కులు తగ్గిస్తారు. మెయిన్స్ అనంతరం సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఫేజ్-3 మౌఖిక పరీక్ష… ఫేజ్-2లో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఒక్కో పోస్టుకు ముగ్గురిని చొప్పున ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. దీనికి 50 మార్కులు. ఫేజ్-2లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ మార్కులను కలిపి తుది నియామకాలు చేపడతారు.
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ
మొత్తం ఖాళీలు: 150. విభాగాల వారీ..
జనరల్ 77
కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 40
ఫైనాన్స్ 15
కంపెనీ సెక్రటరీ 3
సివిల్ ఇంజినీరింగ్ 3
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 3
జియో ఇన్ఫర్మాటిక్స్ 2
ఫారెస్ట్రీ 2
ఫుడ్ ప్రాసెసింగ్ 2
స్టాటిస్టిక్స్ 2
మాస్ కమ్యూనికేషన్ 1
అర్హత విషయానికి వస్తే..జనరల్ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం సరిపోతాయి. లేదా ఎంబీఏ/పీజీడీఎంలో 55 శాతం మార్కులు పొందినవారూ అర్హులే. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం చాలు. మిగిలిన పోస్టులకు సంబంధిత డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం అవసరం.
వయసు… సెప్టెంబరు 1, 2023 నాటికి 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. సెప్టెంబరు 2, 1993 – సెప్టెంబరు 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు.
ఇక ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 23
ఆన్లైన్ ప్రిలిమినరీ: అక్టోబరు 16
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు రూ. 150. మిగతా విభాగాల వారికి రూ.800. కాగా మరిన్ని వివరాల కోసం కింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్సైట్
https://www.nabard.org/