Sharmila’s: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం ఖాయం లాగే కనిపిస్తుంది. ఇదే విషయంగా సోనియాగాంధీతో భేటీ కావడం కోసం భర్తతో కలిసి ఢిల్లీ వెళ్లిన షర్మిల పార్టీలో తన పాత్ర, కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయటం గురించి ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ చర్చలు చేశారు. వైయస్సార్ తో కలిసి పనిచేసిన కాంగ్రెస్ నేతలు షర్మిలకు మద్దతుగా నిలిచారు.
తెలంగాణ ఎన్నికలవేళ మరింత ఆలస్యం చేయకుండా ముందుగా షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని సేవలు వినియోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది. అయితే తెలంగాణకే తాను పరిమితం అవుతానంటూ ముందు నుంచి షర్మిల చెబుతూ వచ్చారు. కానీ రేవంత్ సహా పలువురు నేతలు దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు సోనియాతో సమావేశం సమయంలో ఏపీలోనూ షర్మిల పార్టీ బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తెలంగాణలో ఎన్నికల వరకు ప్రచారంలో షర్మిల భాగస్వామి కానున్నారు. పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల కోరుకున్నా కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనలకు షర్మిల అంగీకరించారని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికలు పూర్తవుతూనే ఏపీలో ఫోకస్ చేసేలా ఇప్పటికే షర్మిల తో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు చేసింది. పార్టీ తరపున ఏపీలో ప్రచారానికి షర్మిల అంగీకరించారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించేందుకు అధిష్టానం సైతం సిద్ధమైంది.
వచ్చే ఎన్నికలలో కడప నుంచి షర్మిల ని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీలో షర్మిల కాంగ్రెస్ నేతగా బాధ్యతలు స్వీకరిస్తే రాష్ట్రంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే ఇదంతా జరగడానికి ముందు సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి నాడు షర్మిల తన భవిష్యత్ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్తో కొనసాగింపు గురించి అధికారికంగా ప్రకటిస్తుందని తెలిసింది. రాహుల్ ని ప్రధానిగా చూడాలని తన తండ్రి లక్ష్యమని ఆ లక్ష్యం దిశగా తాను పనిచేస్తానని షర్మిల చెప్పుకొచ్చింది.